లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలిసారి పోటీ చేస్తున్నారు. మొత్తం ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఇవాళ మొదటి రెండు దశలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. తొలి దశలో 58 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, 57 మంది అభ్యర్థులను ప్రకటించింది. రెండో దశలో 55 శాసనసభ స్థానాలకు గానూ 48 మంది అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ అధిష్టానం.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని బీజేపీ స్పష్టం చేసింది. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య సిరాతు నుంచి బరిలో దిగనున్నారు. అయితే యోగి అయోధ్య నుంచి పోటీ చేస్తారన్న వార్తలు వినిపించాయి. కానీ ఈ ఊహాగానాలకు బీజేపీ అగ్ర నాయకత్వం తెరదించింది. గోరఖ్పూర్ నియోజకవర్గం నుంచి యోగి పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే నియోజకవర్గం నుంచి యోగి ఆదిత్యనాథ్ ఐదు సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు.
బీజేపీ పార్టీ విడుదల చేసిన మొదటి జాబితాలో పలు కొత్త ముఖాలు కనిపించాయి. 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వలేదు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు మహిళలతో పాటు వెనుకబడిన వర్గాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. మొదటి జాబితాలో 44 మంది ఓబీసీలకు, 19 మంది ఎస్సీలకు, 10 మంది మహిళలకు అవకాశం కల్పించారు.