Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల కోసం అధికార బీజేపీ ఐదో జాబితా విడుదల చేసింది. 111 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడిన నవీన్ జిందాల్కు కురుక్షేత్ర టికెట్ను కేటాయించింది. మేనకా గాంధీ, జితిన్ ప్రసాద, బాలీవుడ్ నటి కంగనా రనౌత్, రవిశంకర్ ప్రసాద్ సహా పలువురి పేర్లు జాబితాలో ఉన్నాయి. ఫిలిభిత్ సిట్టింగ్ ఎంపీ వరుణ్ గాంధీకి టికెట్ నిరాకరించింది. ఆయన స్థానంలో ఇటీవల పార్టీలో చేరిన జితిన్ ప్రసాదకు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఆయన తల్లి మేనకా గాంధీకి సుల్తాన్పూర్ టికెట్ను కేటాయించింది. జాబితాలో తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు దక్కింది. వరంగల్ ఆరూరి రమేశ్, ఖమ్మం, తాండ్ర వినోద్ రావుకు టికెట్ కేటాయించింది.
ఐదో జాబితాలో రాష్ట్రాల వారీగా ఏపీలో ఆరుగురు, బిహార్లో 17, గోవా నుంచి ఒకరికి, గుజరాత్ నుంచి ఆరుగురు, హర్యానా నుంచి నలుగురు, హిమాచల్ప్రదేశ్ నుంచి ఇద్దరు, జార్ఖండ్లో ముగ్గురు, కర్ణాటక నుంచి నలుగురు, కేరళలో నలుగురు, మహారాష్ట్రలో ముగ్గురు, ఒడిశాలో 18 మంది, రాజస్థాన్లో ఏడుగురు, సిక్కిం నుంచి ఒక్కరు, తెలంగాణ నుంచి ఇద్దరు, ఉత్తరప్రదేశ్ నుంచి 13 మందికి టికెట్లు కేటాయించింది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు మండి స్థానం నుంచి టికెట్ కేటాయించింది. దృశ్యకావ్యం రామాయణం టీవీ సీరియల్ నటుడు అరుణ్ గోవిల్కు సైతం టికెట్ కేటాయించింది. ఆయన మీరట్ నుంచి లోక్సభ ఎన్నికల బరిలోకి దిగనున్నారు.