Punjab polls : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా బరిలో దిగనున్న కెప్టెన్ అమరీందర్ సింగ్ సారధ్యంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ), సుఖ్దేవ్ సింగ్ ధిండ్సా ఎస్ఏడీ (సంయుక్త్), బీజేపీలు ఉమ్మడి మ్యానిఫెస్టోను ప్రకటిస్తాయని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ తెలిపారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో షెకావత్, రాజ్యసభ ఎంపీ ధిండ్సా, కెప్టెన్ అమరీందర్ సింగ్లు సమావేశమయ్యారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు మూడు పార్టీలు ఉమ్మడి మ్యానిఫెస్టోను వెల్లడించాలని నిర్ణయించామని భేటీ అనంతరం షెకావత్ తెలిపారు. సీట్ల సర్ధుబాటును ఖరారు చేసేందుకు మూడు పార్టీల నుంచి ఇద్దరు సభ్యులతో కూడిన సంయుక్త కమిటీ ఏర్పాటవుతుందని పంజాబ్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ షెకావత్ వెల్లడించారు.
కాంగ్రెస్, అకాలీదళ్, ఆప్తో పాటు రైతు సంఘాలతో కూడిన పార్టీతో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు కూటములు తలపడతాయని బీజేపీ అంచనా వేస్తోంది. ఇక సీఎం పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీ ఏర్పాటు చేసి బీజేపీతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. కెప్టెన్ సింగ్తో పాటు ధిండ్సాతో జట్టుకట్టడంతో ప్రముఖ సిక్కు నేతల తోడ్పాటు లభిస్తుందని కాషాయ పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.