న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడటంతో అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు ప్రతిపక్ష శిరోమణి అకాలీదళ్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ మెల్లగా పావులు కదుపుతున్నాయి. తాజాగా పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతాపార్టీకి మధ్య పొత్తు కుదిరింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి, పంజాబ్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి గజేంద్రసింగ్ షెకావత్ అధికారికంగా ప్రకటించారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేసే విషయమై అమరీందర్సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీకి, తమకు మధ్య ఏడు దఫాలుగా చర్చలు జరిగాయి. ఎట్టకేలకు ఈ ఏడో దఫా చర్చలతో రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయమైంది. అయితే ఈ ఎన్నికల్లో ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే ఈ విషయంలో కూడా నిర్ణయం తీసుకుంటాం అని గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారు.