Punjb | ప్రధాని నరేంద్ర మోదీకి పంజాబ్లో రైతుల సెగ తగిలింది. ప్రధాని పంజాబ్ పర్యటన సందర్భంగా రైతులు తమ నిరసనను వ్యక్తం చేయడంతో 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్పైనే ప్రధాని మోదీ కాన్వాయ్ నిలిచిపోయింది. ఈ వ్యవహారంపై బీజేపీ పంజాబ్ ప్రభుత్వంపై భగ్గుమంది. ఇక.. పంజాబ్ సీఎం చెన్నీ కూడా అంతే స్థాయిలో బీజేపీకి కౌంటర్ ఇచ్చారు.
పంజాబ్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని కాన్వాయ్ విషయంలో పంజాబ్ సీఎం చన్నీకి ఫోన్ చేస్తే, కనీసం అందుబాటులోకి కూడా రాలేదని తీవ్రంగా మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తీవ్ర ఓటమి తప్పదన్న భయంతోనే పంజాబ్ సర్కార్ ప్రధాని మోదీ కార్యక్రమాన్ని విఫలం చేయడానికి ప్రయత్నాలు చేసిందని నడ్డా మండిపడ్డారు.
ప్రధాని మోదీ భద్రత విషయంలో బీజేపీ చేస్తున్న ఆరోపణలపై పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చెన్నీ స్పందించారు. ప్రధాని భద్రత విషయంలో తమ ప్రభుత్వం ఎలాంటి అలసత్వం వహించలేదని ఆయన స్పష్టం చేశారు. భటిండా నుంచి ఫిరోజ్పూర్కు రోడ్డుమార్గం ద్వారా ప్రయాణించాలని అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయమని పేర్కొన్నారు. ‘అధికారికంగా ప్రధాని మోదీ విమానంలో ప్రయాణించాలి. కానీ ఆ ప్లాన్ను మార్చుకున్నారు. రోడ్డు మార్గం గుండా ప్రయాణించాలని అప్పటికప్పుడు నిర్ణయించుకున్నారు. రాజకీయాల కారణాల రీత్యానే తమ ప్రభుత్వంపై బీజేపీ తప్పుడు ఆరోపణలు చేస్తోంది’ అంటూ చన్నీ మండిపడ్డారు.