న్యూఢిల్లీ, అక్టోబర్ 3: సత్యం, అహింస మార్గంలో దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి, విజయం సాధించి ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచిన మహాత్ముడిని ఆయన జయంతి రోజే.. బీజేపీ, సంఘ్పరివార్ శక్తులు తీవ్రంగా అవమానించాయి. శనివారం(అక్టోబర్ 2) సామాజిక మాధ్యమాల్లో గాంధీ హంతకుడు గాడ్సే భజన చేశాయి. గాడ్సే హీరో, గొప్ప దేశభక్తుడు అంటూ గాడ్సే జిందాబాద్ హ్యాష్ట్యాగ్తో కొంతమంది బీజేపీ, సంఘ్పరివార్ నేతలు పోస్టులు పెట్టారు. దీంతో శనివారం కొద్దిసేపు గాడ్సే పేరు ట్విట్టర్లో ట్రెండింగ్గా నిలిచింది. తమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ వేల పోస్టులను తొలగించే ట్విట్టర్, ఫేస్బుక్లు.. ఎంతోమంది అభ్యంతరాలు తెలిపినా, ఈ అంశం ట్రెండింగ్లోకి వచ్చినా దీనిపై మౌనంగా ఉన్నాయి. గాంధీని హత్య చేసిన వ్యక్తిని పొగుడుతుంటే కేంద్రప్రభుత్వం కూడా స్పందించలేదు. ప్రభుత్వానికి వ్యతిరేక పోస్టులపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టి, వాటిని డిలీట్ చేయాలని ట్విట్టర్ను ఆదేశించి, బెదిరిస్తూ పంతం నిలబెట్టుకొంటున్న కేంద్రం గాంధీకి జరిగిన అవమానంపై మౌనసాక్షిగా నిలిచింది. మరోవైపు, మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో శనివారం హిందూ మహాసభ ఓ కార్యక్రమం నిర్వహించింది. గాడ్సే, గాంధీ హత్యలో భాగస్వామి అయిన నారాయణ్ ఆప్టేకు పూలదండలు వేసి నివాళులు అర్పించింది.