BJP | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, (నమస్తే తెలంగాణ): పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇప్పటికే కుదేలైన పేద, మధ్యతరగతి జీవులను టమాటాలు ఏడిపిస్తున్నాయి. రూ. 150 పెట్టినప్పటికీ కిలో టమాటాలు రాకపోవడంతో సామాన్యులు లబోదిబోమంటున్నారు. ధరలను అదుపుచేయాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎప్పటిలాగే పబ్లిసిటీ స్టంట్లను మొదలుపెట్టింది. టమాట ధరలు తగ్గించడానికి, మార్కెట్లో వాటి లభ్యతను పెంచడానికి ‘టమాట గ్రాండ్ చాలెంజ్’ కార్యక్రమాన్ని ఇటీవల ప్రకటించింది. టమాట ధరల నియంత్రణకు ఉత్పత్తి, ప్రాసెసింగ్, నిల్వ విషయాల్లో ఏం చేయాలన్నదానిపై గ్రాండ్ చాలెంజ్లో చర్చించనున్నట్టు తెలిపింది.
ఆసక్తి ఉన్నవారు ‘టమాట గ్రాండ్ చాలెంజ్’ పేరిట ఏర్పాటు చేసిన పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఉచిత సలహాఇచ్చింది. ఒకవైపు, ధరల పెరుగుదలతో బడ్జెట్ పెరిగి సామాన్యులు ఇక్కట్లు పడుతుంటే, గ్రాండ్ చాలెంజ్ల పేరిట కేంద్రం పీఆర్ స్టంట్లకు తెరతీయడంపై పలువురు మండిపడుతున్నారు. సామాన్యుల టమాటా కష్టాలను ఇప్పటికైనా కేంద్రం పరిష్కరించాలని హితవు పలుకుతున్నారు. కాగా సంక్షోభాలను కూడా తమ ప్రచారానికి వాడుకోవడం బీజేపీపరీవారానికి కొత్తేంకాదు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రధాని మోదీ ఒక్క ఫోన్తో నిలుపుదల చేశారని, ఫ్రాన్స్లో అల్లర్లు సద్దుమనగడానికి యూపీ సీఎం యోగీనే కారణమని కమలదళం నేతలు గతంలో గప్పాలకు పోవడం తెలిసిందే.