చండీగఢ్: పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఆ పార్టీ ఎంపీ భగవంత్ మాన్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీలో చేరితే తనకు డబ్బు, క్యాబినెట్ పదవిని ఇస్తామన్నారని తెలిపారు. అయితే తాను ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు చెప్పారు. తాను ‘కమీషన్ లో కాదు మిషన్’లో ఉన్న వ్యక్తినని చెప్పానన్నారు. ఈ మేరకు భగవంత్ మాన్ మీడియాతో ఆదివారం అన్నారు. అయితే ఆయనకు డబ్బు, పదవిని ఆఫర్ చేసిన బీజేపీ సీనియర్ నేత పేరును వెల్లడించలేదు.
బీజేపీకి చెందిన ఒక సీనియర్ నేత తనను నాలుగు రోజుల కిందట సంప్రదించారని భగవంత్ మాన్ తెలిపారు. ‘మన్ సాహబ్, మీరు బీజేపీలో చేరడానికి ఏమి తీసుకుంటారు?’ అని ఆయన అడిగినట్లు చెప్పారు. డబ్బులు కావాలా అని కూడా ఆ బీజేపీ నేత తనతో అన్నారని ఆరోపించారు. తాను బీజేపీలో చేరితే కేంద్ర క్యాబినెట్లో మంత్రి పదవి కూడా ఇస్తామని చెప్పారన్నారు. అయితే తాను కమీషన్పై కాకుండా మిషన్లో ఉన్నట్లు ఆయనతో అన్నానన్నారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆప్ను వీడి బీజేపీలో చేరాలని ఆ బీజేపీ నేత తనను కోరినట్లు భగవంత్ మాన్ చెప్పారు. 750 మంది రైతుల మరణానికి, లఖింపూర్ ఖేరీలో రైతుల హత్యకు, రైతులను ఉగ్రవాదులుగా ముద్రించడానికి, రైతులను ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు కూర్చోబెట్టడానికి బాధ్యత వహించిన పార్టీకి, భగవంత్ మాన్ను కొనుగోలు చేసేంత డబ్బు లేదంటూ బీజేపీపై ఆయన మండిపడ్డారు.