పాట్నా: బీహార్లో బీజేపీ (Bihar BJP) డామినేషన్ కనిపిస్తున్నది. మొత్తం 40 ఎంపీ స్థానాలకుగాను అత్యధికంగా 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నది. తిరిగి ఎన్డీయే కూటమిలో చేరిన సీఎం నితీశ్ కుమార్కు చెందిన జేడీ(యూ) గతంలో 17 స్థానాల్లో పోటీ చేయగా ఈసారి 16 స్థానాల్లో పోటీకి పరిమితమైంది. లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ)కి చెందిన చిరాగ్ పాశ్వాన్కు ఐదు సీట్లు, ఉపేంద్ర కుష్వాహా, జితన్ రామ్ మాంఝీకి చెందిన పార్టీలకు ఒక్కో సీటు కేటాయించారు.
కాగా, ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్, బీజేపీ మధ్య సుదీర్ఘ ప్రతిష్టంభనకు దారి తీసింది. బీజేపీ తొలుత ఎల్జేపీకి ఆరు సీట్లు కేటాయిస్తామని చెప్పింది. అయితే ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ ఎల్జేపీకి ఎనిమిది సీట్లు ఆఫర్ చేసింది. 2019లో బీహార్లో ఆ పార్టీ గెలిచిన ఆరు స్థానాలతోపాటు పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్లో మరో రెండు స్థానాలు కేటాయిస్తామని హామీ ఇచ్చింది.
మరోవైపు బీజేపీకి బద్ధుడైన చిరాగ్ పాశ్వాన్ చివరకు ఐదు స్థానాలతో సరిపెట్టుకున్నాడు. బాబాయ్ పశుపతి పరాస్కు తన కోటా నుంచి సీటు ఇవ్వబోనని ఆయనతో సమావేశం తర్వాత వెల్లడించాడు.