ముంబై: మహారాష్ట్రలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. ఈ నెల 26 నాటికి ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నది. అస్సాంలోని గౌహతి హోటల్లో మకాం వేసిన శివసేన రెబల్ గ్రూప్ నేత ఏక్నాథ్ షిండే ఈ మేరకు తదుపరి ఎత్తుగడకు సిద్ధమైనట్లు తెలుస్తున్నది. మొత్తం 55 మంది శివసేన ఎమ్మెల్యేల్లో సుమారు 42 మంది ఎమ్మెల్యేలు షిండేకు మద్దతిస్తున్నారు. మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలతోపాటు కొందరు శివసేన ఎంపీలు కూడా ఆయన పంచన చేరవచ్చని తెలుస్తున్నది. దీంతో తమను నిజమైన శివసేన గ్రూప్గా గుర్తించాలని ఆయన క్లైమ్ చేయనున్నారు. దీని కోసం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ను కలిసి ఆ మేరకు విన్నవించనున్నారు. అలాగే తన వెంట ఉన్న ఎమ్మెల్యే జాబితా సమర్పించేందుకు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ అపాయింట్మెంట్ను కోరనున్నారు.
కాగా, గవర్నర్ కోష్యారీకి కరోనా సోకడంతో ఆయన కోలుకునే వరకు మహారాష్ట్ర గవర్నర్ బాధ్యతలను గోవా గవర్నర్ శ్రీధరన్కు కేంద్రం అప్పగించవచ్చని తెలుస్తోంది. దీంతో అస్సాంలోని గౌహతిలో బస చేసిన శివసేన రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీ అధికారంలో ఉన్న గోవా రాజధాని పనాజీకి మకాం మార్చవచ్చు. ఈ పరిణామాలతో ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేస్తారని, దీంతో మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వం పడిపోతుందని భావిస్తున్నారు.
మరోవైపు శివసేన రెబల్ గ్రూప్ చీఫ్గా షిండే పేరు ఖరారు కాగానే రంగంలోకి దిగేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. షిండే మద్దతుతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ అపాయింట్మెంట్ కోరనున్నది. ఇదంతా సవ్యంగా సాగితే ఈ నెల 26 ఆదివారం నాటికి బీజేపీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరే అవకాశం ఉన్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, షిండేకు మద్దతుగా పలు బ్యానర్లు వెలిశాయి. శివసేన చీలికకు ఫడ్నవీస్ కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తున్నది.
#MaharashtraPoliticalTurmoil | BJP puts up a poster, which reads "Goddess Mauli, may your blessings continue to be upon us and Devendra ji come to offer prayers to you in Pandharpur, after becoming the CM."
Visuals from Aurangabad. pic.twitter.com/UCLpNRxUGl
— ANI (@ANI) June 23, 2022