బెంగళూరు: కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మైసూర్-కొడగు లోక్సభ స్థానం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన.. మైసూరు-ఊటీ రోడ్డులోని ఓ బస్టాండు మసీదులా ఉందని ఆగ్రహం వ్యక్తంచేశాడు. అధికారులు ఆ బస్టాండును వెంటనే కూల్చివేయకపోతే తానే స్వయంగా కూల్చివేస్తానని హెచ్చరించాడు.
‘నేను దాన్ని సోషల్ మీడియాలో చూశాను. బస్టాండుపై ఒక పెద్ద డోమ్, రెండు చిన్న డోమ్లు ఉన్నాయి. పెద్ద డోమ్ను మధ్యలో, చిన్న డోమ్లను దానికి ఇరువైపుల ఏర్పాటు చేశారు. అది మసీదులా ఉంది. ఆ డోమ్లను కూల్చివేయాలని నేను ఇంజినీర్లకు మూడు, నాలుగు రోజులు గడువు ఇచ్చాను. ఆ లోగా అధికారులు కూల్చకపోతే నేనే స్వయంగా జేసీబీ తీసుకెళ్లి కూల్చివేస్తా’ అని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా వ్యాఖ్యానించాడు.
కాగా, ప్రతాప్ సింహా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగుతున్నది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. అయితే, ప్రతాప్ సింహా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే చాలాసార్లు ఆయన మతాల మధ్య చిచ్చుపెట్టేలా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు.