Sudhanshu Trivedi | కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ విమర్శలు గుప్పించారు. 2024లోనూ మళ్లీ ప్రధానిగా మోదీ ఎన్నికయితే.. రాబోయే రోజుల్లో భారతదేశంలో ఎన్నికలు జరుగవని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది స్పందించారు. మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు గత ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ముసుగులో ఓటర్లు పూర్తిగా తిరస్కరించిన వారిని తాజాగా వారిని ఆదరిస్తున్నట్లుగా ఉన్నాయన్నారు.
పండిట్ నెహ్రూ ఓట్లు లేకుండా ప్రధాని అయ్యారని.. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఎలా ప్రధానమంత్రులు అయ్యారో అందరికీ తెలుసునన్నారు. ప్రజాస్వామ్యం పేరుతో రాచరిక పాలన సాగిస్తున్న వారికి 2019 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు దేశ ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. కశ్మీర్లో అబ్దుల్లా అలియాస్ ముఫ్తీ కుటుంబం ఎన్నికల్లో ఓడిపోయిందన్నారు.
పంజాబ్లో బాదల్ కుటుంబం, హర్యానాలో హుడా కుటుంబం ఎన్నికల్లో, అశోక్ గెహ్లాట్ కుమారుడు ఎన్నికల్లో ఓడిపోయారు, ఉత్తరప్రదేశ్లో అఖిలేశ్ యాదవ్ భార్య ఎన్నికల్లో ఓడిపోయారు, చౌదరి అజిత్ సింగ్, ఆయన కుమారులు ఎన్నికల్లో ఓడిపోయారు, లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె బీహార్ ఎన్నికల్లో ఓడిపోయారన్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పకూలిన తర్వాత విపక్షాల సోకాల్డ్ ఇండియా కూటమి తాజాగా ఛిద్రమైందని సుధాన్షు విమర్శించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రకటనలు చేస్తుందని.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నిరాధారమైన ప్రకటనలు చేశారన్నారు.