భోపాల్: బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు ఒక గిరిజన వ్యక్తిపై గన్తో కాల్పులు జరిపాడు (BJP MLA’s Son Opens Fire). దీంతో గాయపడిన ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్లోని సింగ్రౌలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సింగ్రౌలికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రామ్ లల్లూ వైశ్య కుమారుడు వివేకానంద గురువారం సాయంత్రం 6 గంటలకు కారులో వెళ్తున్నాడు. ఒక ఆలయం సమీపంలోని ఇరుకైన రోడ్డులో కారుకు అడ్డుగా ఉన్న కొందరితో ఘర్షణకు దిగాడు. ఈ సందర్భంగా సూర్య కుమార్ ఖైర్వార్ అనే గిరిజన వ్యక్తిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. కుడి చేతికి బుల్లెట్ గాయం కావడంతో అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఈ సంఘటనకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు వివేకానందపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే బాధిత గిరిజన వ్యక్తి కుల ధ్రువీకరణ పత్రం చూపించనందుకు ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్ను కేసులో చేర్చలేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి.
మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు వివేకానంద గత ఏడాది జూలైలో కూడా అటవీ శాఖ సిబ్బందిని బెదిరించేందుకు గన్తో కాల్పులు జరిపాడు. దీనిపై కేసు నమోదు కావడంతో కొంతకాలం కనిపించకుండా పోయాడు. చివరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో స్థానిక కోర్టులో లొంగిపోయాడు. అయితే బెయిల్ వచ్చే వరకు 45 రోజుల పాటు వైద్య కారణాలతో పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అడ్మిట్ అయ్యాడు. అనంతరం హైకోర్టు నుంచి బెయిల్ పొందిన వివేకానంద, తాజాగా గిరిజన వ్యక్తిపై గన్తో కాల్పులు జరిపాడు.