ముంబై: విద్వేషపూరిత ప్రసంగాలు చేసినందుకు బీజేపీ ఎమ్మెల్యేలు టీ రాజా సింగ్, నితీశ్ రాణే తదితరులపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. సోలాపూర్ సమీపంలోని రాజేంద్ర చౌక్ వద్ద శనివారం జరిగిన హిందూ జన ఆక్రోశ్ సభలో ఈ ఎమ్మెల్యేలిద్దరూ రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని పోలీసులు తెలిపారు. ఈ సభలో పాల్గొన్న సకల హిందూ సమాజ్ నేతలపై కూడా కేసు నమోదు చేసినట్లు చెప్పారు. రాణే ఈ సభలో మాట్లాడుతూ, జీహాదీలు, మసీదుల కూల్చివేత గురించి వ్యాఖ్యలు చేశారన్నారు. గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ, లవ్ జీహాద్ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్నారు. వేర్వేరు మతాలకు చెందినవారి మధ్య శత్రుత్వాన్ని సృష్టించేందుకు వీరు ప్రయత్నించారన్న ఆరోపణలపై కేసు నమోదైంది.