బెంగళూరు: కర్ణాటకలో బసవరాజ్ బొమ్మై కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చేపట్టిన క్యాబినెట్ విస్తరణ అధికార పార్టీలో అసమ్మతి సెగలు రాజేస్తున్నది. మంత్రి పదవి దక్కలేదని కొందరు, మంత్రి పదవి దక్కినా తగిన శాఖ ఇవ్వలేదని మరికొందరు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. తాజాగా ముదిగెరె నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ( Karnataka MLA ) కుమారస్వామి కూడా సొంతపార్టీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ప్రభుత్వం తన సొంత నియోజకవర్గం ముదిగెరెను నిర్లక్ష్యం చేస్తున్నదని కుమారస్వామి ఆరోపించారు. ఈ మేరకు కర్ణాటక అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. నిధుల విషయంలో ప్రభుత్వం తన నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేస్తున్నదంటూ ప్లకార్డు ప్రదర్శించారు. 2019 నుంచి వరుసగా భారీ వర్షాలు తన నియోజకవర్గాన్ని ముంచెత్తుతుంటే ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సాయం చేయడంలేదని కుమారస్వామి మండిపడ్డారు.