బెంగళూర్ : మసీదులు, దర్గాల్లో ప్రార్ధనలకు నెమలి ఈకలను ఉపయోగిస్తున్నారని, వాటిపై దాడిచేయాలని కర్నాటక బీజేపీ నేత అరవింద్ బెల్లాడ్ డిమాండ్ చేశారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ, నటుడు జగ్గేష్ ఓ టీవీ ఇంటర్వ్యూలో పులి గోరు లాకెట్ ధరించి కనిపించడంతో ఆయన నివాసంపై అటవీ శాఖ అధికారులు దాడులు చేసిన నేపధ్యంలో బెల్లాడ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మసీదులు, దర్గాలను కాకుండా జగ్గేష్ నివాస సదుపాయాలు, ప్రాంగణాలపై వివరణ కోరడం పట్ల కర్నాటక సీఎం సిద్ధరామయ్య తీరును బెల్లాడ్ తప్పుపట్టారు. పాజిటివ్ వైబ్రేషన్స్ కోసం చారిత్రకంగా పులి గోరులను వాడుతుంటారని, రాజ్యసభ ఎంపీ జగ్గేష్పై ఫిర్యాదు నమోదు చేస్తే మరి దర్గాలు, మసీదుల్లో నెమలి ఆకులు వాడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
ఈ నెమలి ఈకలకు మొక్కి సిద్ధరామయ్య ఆశీస్సులు తీసుకుంటారని అన్నారు. నెమలి మన జాతీయ పక్షి, ఇలా చేయడం చట్ట విరుద్ధం, నేరం అని పేర్కొన్నారు. ప్రతి మసీదు, దర్గాపై దాడులు చేపట్టి ఈ ప్రదేశాలపై కేసులు నమోదు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే కర్నాటక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Read More :
Cyber Fraud | జ్యూవెలరీ స్టోర్ ఈమెయిల్ ఐడీ చోరీ : రూ 18 లక్షలు కొట్టేసిన స్కామర్లు