పట్నా : బిహార్ సీఎం నితీష్ కుమార్ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తనను చాలా బాధించాయని, ఈ వ్యవహారం పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లానని బీజేపీ ఎమ్మెల్యే నిక్కీ హెంబ్రాం అన్నారు. నితీష్ వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవని పదేపదే వాటి గురించి మాట్లాడటం సరైంది కాదని ఆమె పేర్కొన్నారు. పట్నాలో సోమవారం ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో నితీష్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మహువ పానీయం తయారీలో ఉపాధి పొందుతున్న వారికి ప్రత్యామ్నాయం చూపాలని ఆమె కోరిన క్రమంలో ఎమ్మెల్యే నిక్కీని ఉద్దేశించి మీరు అందంగా (బ్యూటిఫుల్) ఉంటారంటూ నితీష్ వ్యాఖ్యానించారు.
మహువ తయారీలో నిమగ్నమైన గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి బీజేపీ ఎమ్మెల్యేకు తెలియదని పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య స్పందిస్తూ సీఎంను తప్పుపట్టారు. ఈ వయసులో కూడా ఆయన అభాసుపాలయ్యారని ఎద్దేవా చేశారు. ఇక నితీష్ మహిళా ఎమ్మెల్యేను కించపరచలేదని, ఆమె తప్పుగా అర్ధం చేసుకున్నారని, సీఎం మహిళలను గౌరవిస్తారని జేడీ(యూ) నేత లెసి సింగ్ అన్నారు.