లక్నో: ఉత్తరప్రదేశ్లో బీజేపీని వీడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో ఎమ్మెల్యే ముకేశ్ వర్మ ఆ పార్టీకి గుడ్బై చెప్పేశాడు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. భారతీయ జనతా పార్టీకి వీడ్కోలు పలికిన ఏడో ఎమ్మెల్యేగా ముకేశ్ నిలిచాడు. ఇక ముకేశ్ కూడా సమాజ్వాదీ పార్టీ వైపు బాటకట్టినట్లు తెలుస్తోంది. ఇవాళ తన రాజీనామాను ట్విట్టర్లో ప్రకటించిన ఎమ్మెల్యే ముకేశ్.. వలసలను ప్రారంభించిన స్వామి ప్రసాద్ మౌర్య ఇంటి వద్ద కనిపించారు. పశ్చిమ యూపీలోని ఫిరోజాబాద్.. ముకేశ్ వర్మ నియోజకవర్గం. ఈయన కూడా బీసీ నేతనే. వెనుకబడిన కులాలకు చెందిన నేతల్ని యూపీలో బీజేపీ విస్మరిస్తోందని ముకేశ్ ఆరోపించారు. అణగారిన వర్గాల గొంతుగా స్వామి ప్రసాద్ మౌర్య నిలుస్తారని, ఆయనే మా నేత అని ఎమ్మెల్యే ముకేశ్ అన్నారు. దళితులు, బీసీలు, మైనార్టీలకు గడిచిన అయిదేళ్లలో బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని ఆయన తన రాజీనామా లేఖలో రాశారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను కూడా బీజేపీ ఆదుకోలేదన్నారు. ఇలాంటి విధానాలు ఉండడం వల్లే.. బీజేపీని వీడుతున్నట్లు ఎమ్మెల్యే ముకేశ్ తెలిపారు.