రాయ్పూర్: చత్తీస్ఘడ్ బీజేపీ ఎమ్మెల్యే(BJP MLA) ధరమ్లాల్ కౌషిక్ మార్నింగ్ వాక్కు వెళ్లిన సమయంలో ఆయన ఫోన్ను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బైక్పై వచ్చిన ఇద్దరు.. ఎమ్మెల్యే చేతుల్లోంచి ఫోన్ లాక్కెళ్లారు. ఈ ఘటన పట్ల ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో శాంతి, భద్రతలు లోపించాయని కాంగ్రెస్ ఆరోపించింది. చత్తీస్ఘడ్లోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం శోచనీయమని కాంగ్రెస్ విమర్శించింది. పోలీసుల కథనం ప్రకారం.. ఎమ్మెల్యే కౌషిక్ ఇవాళ ఉదయం ఇంటి నుంచి మార్నింగ్ వాక్ కోసం వెళ్లారు. సివిల్ లైన్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని పీడబ్ల్యూడీ ఫ్లైఓవర్పై ఒంటరిగా నడుస్తున్న సమయంలో బైక్పై వచ్చిన దొంగలు ఎమ్మెల్యే చేతిలో ఉన్న ఫోన్ను ఎత్తుకెళ్లారు. ఎమ్మెల్యే కౌషిక్ ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. సీసీటీవీ ఫూటేజ్ను స్కాన్ చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లిన ఘటన గురించి ఎమ్మెల్యే కౌశిక్ ద్రువీకరించారు. పోలీసులు ఈ ఘటనను దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మాజీ సీఎం భూపేశ్ భగల్ తన ఎక్స్ అకౌంట్లో రియాక్ట్ అయ్యారు. చోరీలు, కత్తులతో దాడులు, మర్డర్లు, దొంగతనం లాంటి ఘటనలు రాష్ట్రంలో పెరిగిపోయినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక రాష్ట్రానికి చెందిన హోంమంత్రి మాత్రం రీల్స్, రిసెప్షన్లతో బిజీగా ఉన్నట్లు ఆరోపించారు.