బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు (Karnataka Polls) దగ్గరపడుతుండటంతో కాషాయ పార్టీ ఓటర్లను మత ప్రాతిపదికన విభజించేలా విద్వేష వ్యాఖ్యలు చేస్తోంది. రాష్ట్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే అన్ని మదర్సాలను మూసివేస్తామని ఆ పార్టీ ఎమ్మెల్యే బసనగుడ పాటిల్ యత్నాల్ పేర్కొన్నారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బాటలో ఈ నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే బెలగావిలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపారు. అసోంలో అన్ని మదర్సాలను మూసివేయాలని భావిస్తున్నామని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ గురువారం వెల్లడించారు.
నవ భారత్లో మదర్సాల అవసరం లేదని సీఎం శర్మ అభిప్రాయపడ్డారు. ఇక కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాషాయ పార్టీలో విభేదాలు తీవ్రమయ్యాయి. చికమగుళూర్ జిల్లా మడికెరలో స్ధానిక ఎమ్మెల్యే ఎంపీ కుమారస్వామికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో కుమారస్వామికి పార్టీ టికెట్ ఇవ్వవద్దని నిరసనకారులు డిమాండ్ చేశారు. మాజీ సీఎం యడ్యూరప్ప ఈ ప్రాంతంలో భారీ రోడ్షో నిర్వహణకు ముందు భారీ నిరసన ప్రదర్శనలు చోటుచేసుకున్నాయి.
విజయ్ సంకల్ప్ యాత్ర సందర్భంగా యడ్యూరప్ప ఈ ప్రాంతానికి రాగానే ఆయన కారును నిరసనకారులు అడ్డగించి ధర్నాకు దిగారు. పార్టీ కార్యకర్తలు తన కాన్వాయ్ను అడ్డగించడంతో ఆగ్రహించిన యడ్యూరప్ప తన కార్యక్రమాన్ని రద్దుచేసుకుని వెనుతిరిగారు. యడ్యూరప్ప కార్యక్రమాన్ని అడ్డుకున్న పార్టీ కార్యకర్తలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నాటకలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
Read More :