మధ్యప్రదేశ్ ఉన్నత విద్యా శాఖ మంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ సీతాదేవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీతాదేవి జీవితం విడాకులు తీసుకున్న వ్యక్తి జీవితంలాంటిదే అని పోల్చారు. రాముడు ఎన్ని కష్టాలు పెట్టినా.. అడవిలో పిల్లలకు జన్మనిచ్చినా.. ఆయన క్షేమాన్నే సీత కోరుకున్నదని చెప్పారు. ఎన్ని బాధలు ఉన్నా రాముడినే లవకుశలు కీర్తించారని చెప్పుకొచ్చారు. ఆమె భూమిలోకి తిరిగి వెళ్లిపోవడాన్ని నేటి కాలంలో ఆత్మహత్యగా అభివర్ణించారు. ఆదివారం సాయంత్రం ఉజ్జయినిలోని నాగ్డాలో జరిగిన కరసేవక్ సమ్మాన్లో సదరు విద్యామంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం సృష్టించింది. వందేమాతరం గ్రూపు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 94 మంది కరసేవకులను సత్కరించాలని నిర్ణయించారు. అయితే, వీరిలో చాలా మంది ఇప్పటికే చనిపోయారు. చాలా మంది కరసేవకులు తమ భార్య, పిల్లలతో సన్మాన కార్యక్రమానికి వచ్చారు.
కరసేవక్ సమ్మాన్ కార్యక్రమంలో మంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ శ్రీరాముడి జీవితంలో జరిగిన ఘటనలపై ప్రసంగిస్తూ గర్భం ధరించినప్పటికీ రాజ్య గౌరవం చూసి సీతామాతను రాముడు విడిచిపెట్టాల్సి వచ్చిందన్నారు. సీతామాత పిల్లలు అడవిలో పుట్టాల్సి వచ్చిందని, ఇన్ని బాధలున్నా ఆ తల్లికి తన భర్తపై ఎంతో గౌరవం ఉందని చెప్పారు. కష్టాలను మర్చిపోయి కూడా సీతామాత రాముడి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తుందని, ఇలాంటి జీవితం నేటి కాలంలో విడాకులు తీసుకున్న తర్వాతి జీవితంలాంటిదన్నారు.
భూమి చీలిపోయి అందులో సీతమ్మ లీనమైపోతుందని, రాముడి ఎదుటే సీతమ్మ తన శరీరాన్ని వదిలేసిందని.. ఇది ఇవాల్టి కాలంలో ఆత్మహత్యగా పరిగణించాల్సి వస్తుందని డాక్టర్ మోహన్ యాదవ్ చెప్పుకొచ్చారు. సీత లేకుండా రాముడు ఒక్క రోజు ఉండటం కూడా ఊహించడం కష్టంగా ఉన్నదన్నారు. రాముడు, సీత త్యాగంలో ప్రేమ ఉన్నదని చెప్పారు. లక్ష్మణుడు కూడా తన జీవితాన్ని రాముడి కోసం త్యాగం చేశాడని, అయినప్పటికీ రామరాజ్యం కొనసాగిందని పేర్కొన్నారు.