జైపూర్ : రాజస్ధాన్లో కాంగ్రెస్ సర్కార్ తప్పుడు విధానాలు, అంతర్గత కలహాలతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర మంత్రి అర్జున్రాం మేఘ్వాల్ విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని అశోక్ గెహ్లో్త్ సర్కార్పై కేంద్ర మంత్రి విరుచుకుపడ్డారు. దళితులు, మహిళలపై వేధింపులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం రెండు గ్రూపులుగా విడిపోయి కుమ్ములాటల్లో మునిగితేలుతోందని ఆరోపిచారు. కాగా రాజస్ధాన్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు తీవ్రమైన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడేందుకు ఎలాంటి వ్యూహాలు చేపట్టాలనే దానిపై రాజస్ధాన్ ఏఐసీసీ ఇన్చార్జ్ అజయ్ మాకెన్ ఇటీవల ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో మూడు రోజుల పాటు చర్చించారు. రాష్ట్రంలో జిల్లా, బ్లాక్ స్ధాయిలో పార్టీ అధ్యక్షుల నియామకం చేపడతామని మాకెన్ పేర్కొన్నారు.