అటల్ ఉదారవాదం నుంచి మోదీ అతివాదం వైపు
ఇద్దరు నేతల ఇలాకాగా మారిన పార్టీ
మాట వింటే మనవాడు.. లేకుంటే ఈడీ పాలు
సొంతపార్టీ నేతలనూ వెంటాడుతున్న బుల్డోజర్
న్యూఢిల్లీ, జూన్ 27: విలువలు లేవు.. సిద్ధాంతాలు అసలు లేవు.. నాయకులు లేనే లేరు.. ఇద్దరే ఇద్దరు.. మహామహులు స్థాపించిన పార్టీని కబ్జా చేసేశారు. ఎవరి మాటకూ ప్రాధాన్యం లేదు. వాళ్లిద్దరూ ఏది చెప్తే అదే సిద్ధాంతం.. ఏది పాటిస్తే అదే విలువ. వాళ్లు ఎవరిని వేలుపెట్టి చూపిస్తే వాళ్లే నాయకులు.. వారు ఏం చేసినా హైహై నాయకా అని చిడతలు వాయించిన వాళ్లు అసమదీయులు.. ఎవరైనా ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడినా.. తసమదీయులే.. ఒక్క ఇషారా చేశారంటే.. ఈడీ, సీబీఐ పంజాల్లో విలవిల్లాడాల్సిందే. బాబోయ్ కమలం పువ్వు చెవిలో పెట్టుకొంటామంటూ పాదాల మీద పడితే చాలు.. ఎంతటి ఆర్థిక నేరగాళ్లయినా.. కమ్యూనిస్టులైనా, మావోయిస్టులైనా, ఏ రాజకీయ పార్టీ వాళ్లయినా దత్తపుత్రులయిపోతారు. ఇది ఇవాళ్టి బీజేపీ అని చెప్పుకొంటున్న ఇద్దరు వ్యక్తుల రాజకీయ పార్టీ. ఈ బీజేపీ 1980లో అటల్ బిహారీ వాజపేయి, లాల్కృష్ణ అద్వానీ వంటి అనేక దిగ్గజ నాయకుల నేతృత్వంలో ఏర్పడిన భారతీయ జనతాపార్టీ కాదు. ఆనాటి సిద్ధాంతాలు ఇప్పుడు మనకు కనిపిస్తున్న బీజేపీకి లేనే లేవు. ప్రస్తుత బీజేపీకి ఎలాంటి సైద్ధాంతిక ప్రాతిపదిక లేదు. ఆనాటి ఉదారవాద హిందుత్వమూ పూర్తిగా గతి తప్పిపోయింది. ఇప్పుడంతా అతివాదం మాత్రమే బీజేపీని నడిపిస్తున్నది.
ఆనాడు బీజేపీని అటల్బిహారీ వాజపేయి, ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి త్రిమూర్తులుగా బీజేపీకి అంటరాని పార్టీ అన్న పేరును పోగొట్టి అందరికీ ఆమోదయోగ్యంగా తీర్చిదిద్దారు. రాజకీయాల్లో ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోవటం.. మంచి అంశాలను అంగీకరించడం వంటివి ఆ నేతల లక్షణాలుగా ఉండేవి కాబట్టే.. బీజేపీని తీవ్రంగా విమర్శించేవారు సైతం ‘పాత బీజేపీ’ ప్రజల అనుకూలంగా, సున్నితంగా ఉండేదని అంగీకరిస్తారు.
ఇప్పుడు నయావాదుల చేతుల్లోకి బీజేపీ వెళ్లిపోయింది. వాళ్లకు ఉత్తరప్రదేశ్ ఒక ప్రయోగశాలగా మారిపోయింది. వాజపేయి కాలం నాటి హిందుత్వ నీడలు.. జాడలు మచ్చుకు కూడా ఇప్పుడా పార్టీలో కనిపించడంలేదని ఆ పార్టీ సీనియర్ నేతలే వాపోతున్నారు. ‘దాని (బీజేపీ) సిద్ధాంతంతో ఏకీభవించకపోయినప్పటికీ అప్పుడది ఒక మంచి పార్టీగానే ఉండేది. అయోధ్య ఉద్యమంలో నేను క్రియాశీలంగా పాల్గొన్నాను. కానీ మేము ఎన్నడూ ఒకరిని తక్కువ చేసి మాట్లాడలేదు. ఒక సామాన్య కార్యకర్త కూడా వాజపేయి దాకా వెళ్లి తన మనసులో ఉన్నది చెప్పగలిగేవాడు. ఇప్పుడు అలా చేయడం సాధ్యమేనా?’ అని పలుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ బీజేపీ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ప్రస్తుత బీజేపీ ఇప్పుడు తన కార్యకర్తలను ముఖ్యంగా యువతను అతివాదులుగా, హింసావాదులుగా మార్చివేసిందని ఆయన పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్లో గొడ్డుమాంసం ఇంట్లో దాచి ఉంచాడన్న అనుమానంతో దుండగులు ఇఖ్లాక్ను చంపిన ఘటన అయినా.. బులంద్షహర్లో ఆందోళనకారులను అదుపు చేస్తున్న కానిస్టేబుల్ను దారుణంగా హత్య చేసిన ఘటన అయినా.. ఇవాల్టి బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా హింసకు పాల్పడుతున్నారు. ఇక యువతరం అయితే.. మునుపెన్నడూ లేని విధంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా జ్ఞాన్వాపీ మసీదు కానీ, షాహీ ఈద్గా అంశాలు వచ్చినప్పుడు ‘హమ్ లడ్కే లేంగే.. ఛీన్ కే లేంగే’ అని నినాదాలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో అయితే బుల్డోజర్ బీజేపీకి కమలం పువ్వు స్థానంలో గుర్తుగా మారిపోయింది. పార్టీ, దాని కార్యకర్తల మూడ్కు బుల్డోజర్ ప్రతీకగా మారింది. తమ పార్టీ వాళ్లయినా.. ఇతర పార్టీల వాళ్లయినా.. కొంచెం తేడాగా మాట్లాడినా బుల్డోజర్ భయం వాళ్లను వెంటాడుతున్నది. బీజేపీ నేతలు ఇంటర్వ్యూలు ఇవ్వాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి ఉన్నదంటేనే అర్థం చేసుకోవచ్చు!
‘అటల్ బిహారీ వాజపేయి ఎన్నడూ ముస్లింలను వ్యతిరేకించలేదు. లక్నో వచ్చిన ప్రతిసారీ ముస్లిం పెద్దలను కలిసేవారు. వారితో కలిసి అల్పాహారం తీసుకొనేవారు. ఆ రోజుల్లో ఏ బీజేపీ నేత కూడా ముస్లింలకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు సబ్కా వికాస్, సబ్కా సాథ్, సబ్ కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అంటూ చెప్పుకొనే బీజేపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఊర్లపేర్లు మార్చేశారు. మొన్నటికి మొన్న ఆజమ్గఢ్ను ఆర్యమ్గఢ్గా మారుస్తానని కూడా హామీ ఇచ్చారు. ఒక్క రోజు కూడా ముస్లింలకు శుభాకాంక్షలు చెప్పడం కానీ, ఈద్ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ చేయనే లేదు. గతంలో రాజ్నాథ్సింగ్, కల్యాణ్ సింగ్ సైతం హిందూయేతరులతో కలిసిమెలిసి ఉండేవారు. రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ పార్టీలు నిర్వహించేవారు. సబ్కాసాథ్, సబ్కా వికాస్ స్ఫూర్తిని అప్పుడే నిజంగా పాటించారు.’ అని ఉత్తరప్రదేశ్లో సీనియర్ బీజేపీ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ఇది చాలా ప్రమాదకరమైన పోకడ అని సమాజ్వాదీ నేత షఫీఖుర్ రహమాన్ హెచ్చరించారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఈ నయా బీజేపీ ధోరణిని ఆ పార్టీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ బహిరంగంగా సమర్థించడం లేదు. పైగా ఇటీవల జ్ఞాన్వాపీ వివాదం తలెత్తినప్పుడు ‘ప్రతి భవనం కింద శివలింగాన్ని వెతకడం సరికాదు’ అని ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్ వ్యాఖ్యానించడం కుతుబ్మినార్, తాజ్మహల్ వంటి వాటిపై వివాదాలను సృష్టించడాన్ని ఆమోదించడంలేదని సంకేతమిచ్చినట్టయింది.