ముంబై: బీజేపీ వాషింగ్ మెషిన్ లాంటిదని మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్) అధినేత శరద్ పవర్ (Sharad Pawar) అన్నారు. ఆ పార్టీలో చేరిన అవినీతి వ్యక్తులు క్లీన్గా మారతారని విమర్శించారు. బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలను కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటున్నదని ఆయన ఆరోపించారు. పూణే జిల్లాలోని లోనావాలాలో జరిగిన తన పార్టీ కార్యకర్తల సదస్సులో శరద్ పవార్ మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి గురించి మాట్లాడుతూ అవిభజన ఎస్పీపీతో సహా విపక్ష పార్టీలను విమర్శిస్తారని అన్నారు. ఇటీవల పార్లమెంటులో ఒక బుక్లెట్ ఇచ్చారని, బీజేపీ అధికారంలో లేనప్పుడు ఎలాంటి అక్రమాలు జరిగాయో అందులో పేర్కొన్నారని చెప్పారు. అయితే ఆ బుక్లెట్లో ప్రస్తావించిన ఆదర్శ్ కుంభకోణంలో ప్రమేయం ఉన్న అశోక్ చవాన్, సరిగ్గా ఏడో రోజున బీజేపీ చేరి రాజ్యసభ సభ్యుడయ్యారని గుర్తు చేశారు.
కాగా, దీనికి ముందు మహారాష్ట్రలో రూ.70,000 కోట్ల సాగునీటి స్కామ్, మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్లో అక్రమాల గురించి ప్రధాని మోదీ మాట్లాడారని శరద్ పవార్ తెలిపారు. అయితే ఏ వ్యక్తిపై మోదీ ఆరోపణలు చేశారో ఆ వ్యక్తి ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో చూశారుగా అని అన్నారు. ఎన్సీపీలో తిరుగుబాటు చేసి బీజేపీ ప్రభుత్వంలో చేరి డిప్యూటీ సీఎం అయిన అజిత్ పవర్ గురించి పరోక్షంగా ప్రస్తావించారు. ఒక వైపు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలపై అవినీతి ఆరోపణలు చేస్తూ మరోవైపు ఆ వ్యక్తులను బీజేపీలో చేర్చుకుంటున్నారని శరద్ పవర్ మండిపడ్డారు. ‘అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని చేర్చుకుని క్లీన్ చేసే వాషింగ్ మెషీన్గా బీజేపీ మారిందని ఇదంతా తెలియజేస్తోంది’ అని ఆరోపించారు.
మరోవైపు దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై ప్రధాని మోదీ చేసిన విమర్శలను శరద్ పవర్ తప్పుపట్టారు. ‘నెహ్రూ, ఆయన భావజాలాన్ని మోదీ ఎక్కువగా విమర్శిస్తున్నారు. మీరు వార్తాపత్రికలను పరిశీలిస్తే ‘మోదీ కీ గ్యారెంటీ’పై పూర్తి పేజీ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలను ప్రచురించడానికి ఎవరి డబ్బు వినియోగిస్తున్నారో పరిశీలిస్తే, అది ప్రజల డబ్బు అని సమాధానం వస్తుంది’ అని అన్నారు.
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని, అయితే గత దశాబ్దంలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా పెరిగాయని శరద్ పవార్ తెలిపారు. బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలైన అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, హేమంత్ సోరెన్ను లక్ష్యంగా చేసుకోవడంపై మండిపడ్డారు. అలాగే తన పార్టీ కార్యకర్తలను బెదిరిస్తున్న ఎన్సీపీ రెబల్ ఎమ్మెల్యేలను ఘాటుగా హెచ్చరించారు. అలాంటి వారు శరద్ పవార్ను నేరుగా ఎదుర్కోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.