గువాహటి, ఆగస్టు 6: కొవిడ్ విజృంభణతో గత రెండేండ్లుగా చర్చల నుంచి పక్కకుపోయిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అంశాన్ని బీజేపీ నేతలు మళ్లీ కదిపారు. కరోనా బూస్టర్ డోసు ముగియగానే సీఏఏ అమలుకు నిబంధనల రూపకల్పన కోసం చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్షా చెప్పారని పశ్చిమబెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి ఇటీవల పేర్కొనడం ఈశాన్య రాష్ర్టాల్లో మళ్లీ మంట రాజేసింది. ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని, ప్రజలు కూడా తిరిగి ఉద్యమం ప్రారంభించేందుకు సిద్ధమవ్వాలని తాజాగా నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్, క్రిషక్ ముక్తి సంగ్రామ్ సమితి, రాయ్జోర్ దాల్ తదితర సంస్థలు పిలుపునిచ్చాయి. ఇదే సమయంలో డిసెంబర్ నాటికి సీఏఏ అమలవుతుందని, ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం త్వరలో సమావేశమై చర్చిస్తుందని బెంగాల్ బీజేపీకి చెందిన శరణార్థి సెల్ చైర్మన్, ఎమ్మెల్యే అశిం సర్కార్ శుక్రవారం చెప్పడం అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లయింది.
సీఏఏపై అందుకే హడావుడి
అస్సాం సహా ఈశాన్య రాష్ర్టాల్లో సీఏఏ అమలు చేయకుండా అడ్డుకుంటామని ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ హెచ్చరించింది. తమ స్టాండ్కు కట్టుబడి ఉన్నామని ఏజేవైసీపీ ప్రధాన కార్యదర్శి పలాశ్ చాంగ్మై స్పష్టం చేశారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనలకు సిద్ధమవ్వాలని ఈశాన్య రాష్ర్టాల ప్రజలకు పిలుపునిచ్చారు. 2024 లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందే ఉద్దేశంతో బీజేపీ మళ్లీ సీఏఏపై హడావుడి మొదలు పెట్టిందని మండిపడ్డారు. సీఏఏ వ్యతిరేక ఉద్యమం తమకు జీవన్మరణ సమస్య అని, అస్సాంలో స్థానిక కమ్యూనిటీలను మైనార్టీలుగా మార్చేడమే సీఏఏ వెనుకవున్న కుట్ర అని రాయ్జోర్ దాల్ అధ్యక్షుడు అఖిల్ గొగోయ్ ఆరోపించారు.
నాగా సమస్యను తొందరగా తీర్చండి
నాగా ప్రజల రాజకీయ సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నాగాలాండ్ పీపుల్స్ యాక్షన్ కమిటీ (ఎన్పీఏసీ) భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. నాగాలాండ్ గావ్ బురా ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ అంశంపై దిమాపూర్లో ఇటీవల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అనేక పౌర సంఘాలు, ఆదివాసీ సంఘాలు, మేధావులు, ప్రజా సంఘాల నేతలు భారీగా హాజరయ్యారు. వీరంతా కలసి ఎన్పీఏసీగా ఏర్పడ్డాయి. కాగా, శనివారం ర్యాలీ సందర్భంగా దిమాపూర్, కొహిమాలో దుకాణాలు మూసేశారు.
ఎన్నార్సీ అమలుకు మణిపూర్ అసెంబ్లీ ఆమోదం
రాష్ట్ర జనాభా కమిషన్ ఏర్పాటు, జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ) అమలుకు సంబంధించిన రెండు తీర్మానాలను మణిపూర్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ రెండు ప్రైవేట్ మెంబర్ తీర్మానాలను జేడీయూ ఎమ్మెల్యే కేహెచ్ జోయ్కిషన్ అసెంబ్లీ సమావేశాల చివరి రోజైన శుక్రవారం శాసనసభ ముందుకు తెచ్చారు. రాష్ట్రంలోని పర్వత, లోయ ప్రాంతాల్లో జనాభా విపరీతంగా పెరిగిందని పేర్కొన్నారు. బయటి ప్రాంతాల నుంచి మణిపూర్లోకి చొరబాట్లు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయని చెప్పారు.