డెహ్రాడూన్: బీజేపీ నేత కుమార్తెకు ముస్లిం వ్యక్తితో పెళ్లి జరుగనున్నది (BJP leader’s daughter wedding). ‘ది కేరళ స్టోరీ’ సినిమా వివాదం నేపథ్యంలో ఇది ‘లవ్ జిహాద్ కాదా?’ అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లోని పౌరీ ప్రాంతానికి చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ యశ్పాల్ బెనమ్ కుమార్తె ఈ నెల 28న ముస్లిం వ్యక్తిని పెళ్లాడనున్నది. ఉత్తరప్రదేశ్లోని లక్నో యూనివర్సిటీలో చదివిన ఆమెకు ముస్లిం వ్యక్తి మధ్య ప్రేమాయణం నడిచింది. ఈ నేపథ్యంలో ఈ జంటకు పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి.
కాగా, ఈ నెల 28న పౌరీలోని రిసార్ట్లో బీజేపీ నేత కుమార్తెకు ముస్లిం వ్యక్తితో పెళ్లి జరుగనున్నది. ఈ పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో హిందుత్వ సంఘాలతో పాటు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పెళ్లిని వ్యతిరేకిస్తూ వీహెచ్పీ, భజరంగ్ దళ్ నిరసనలు చేపట్టాయి. హిందుత్వాన్ని కాపాడాల్సిన బీజేపీ నేతలు తమ కుమార్తెలను ముస్లిం వ్యక్తులకు ఇచ్చి పెళ్లి చేయడంపై హిందూ సంఘాల నేతలు మండిపడ్డారు. యశ్పాల్ బెనమ్ను బీజేపీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఈ పెళ్లిపై నెటిజన్లు కూడా స్పందించారు. ‘ది కేరళ స్టోరీ’ సినిమా వివాదం నేపథ్యంలో ఇది ‘లవ్ జిహాద్ కాదా?’ అని కొందరు ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ‘లవ్ జిహాద్’కు వ్యతిరేకంగా చట్టాలు చేసిన బీజేపీ నేతలు తమ కుమార్తెలను ముస్లిం వ్యక్తులకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల జిమిక్కుగా మరి కొందరు విమర్శించారు. అయితే కొందరు మాత్రం ఈ పెళ్లిని సమర్థించారు. ఇలాంటి వివాహాలతో సమాజంలో మత విద్వేషాలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు.