చెన్నై: లోక్సభ ఎన్నికల ముంగిట తమిళనాడులో పెద్ద ఎత్తున నగదు పట్టుబడింది. బీజేపీ తిరునల్వేలి లోక్సభ అభ్యర్థి నాయనార్ నాగేంద్రన్ మద్దతుదారులుగా భావిస్తున్న ముగ్గురు వ్యక్తుల నుంచి ఎన్నికల అధికారులు రూ.4 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఎగ్మోర్ నుంచి తిరునల్వేలి వెళ్తుండగా తాంబరం వద్ద తనిఖీ చేయడంతో ఈ నగదు పట్టుబడిందని అధికారులు తెలిపారు. నగదుకు సంబంధించి వీరి వద్ద సరైన పత్రాలు లేవని పేర్కొన్నారు.
బీజేపీ మద్దతుదారుల వద్ద పెద్ద ఎత్తున నగదు పట్టుబడటంపై అధికార డీఎంకే స్పందించింది. నాగేంద్రన్పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధానాధికారిని కోరింది. ఓటర్లకు పంపిణీ చేయడం కోసమే వీరు ఈ సొమ్మును తీసుకెళ్తున్నారని ఆరోపించింది. నాగేంద్రన్ మాట్లాడుతూ, ఈ నగదుతో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు.