రాయ్పూర్: ఖరీదైన కారులో వచ్చిన కొందరు దుండగులు బీజేపీ నేతకు చెందిన మేకను చోరీ చేశారు. (BJP Leader’s Goat Stolen) మటన్ షాపు వ్యక్తికి దాని అమ్మేశారు. అయితే అదృశ్యమైన తన మేక కోసం ఆ బీజేపీ నేత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్లో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 8న రూ.18 లక్షల విలువైన కారులో కొందరు వచ్చారు. బీజేపీ నేత సురేష్ గుప్తాకు చెందిన మేకను ఆయన ఇంటి నుంచి చోరీ చేశారు. అనంతరం ఖరీదైన ఆ కారులో పారిపోయారు.
కాగా, బీజేపీ నేత సురేష్ గుప్తా, ఆయన కుటుంబానికి ఆ మేకతో చాలా అనుబంధం ఉంది. కుటుంబంలో ఒక సభ్యుడి మాదిరిగా దానిని పెంచారు. అంత అనుబంధం ఉన్న 120 కిలోల బరువున్న మేక అదృశ్యంపై సురేష్ గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థానిక పోలీసులు అంతగా పట్టించుకోకపోవడంతో కొందరితో కలిసి అదనపు ఎస్పీని కలిశాడు. దీంతో మేకను వెతికేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు.
మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలించారు. ఖరీదైన కారులో వచ్చిన వ్యక్తులు మేకను చోరీ చేసినట్లు గుర్తించారు. 120 కేజీల బరువున్న ఆ మేకను మటన్ షాపు వ్యక్తికి రూ.27,000కు వారు అమ్మేయగా దానిని కోసి మాంసంగా విక్రయించినట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. ఆ మేక చోరీకి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అయితే తమ మేకను మటన్ షాపులో అమ్మేయడం, దానిని కోసి మటన్గా విక్రయించినట్లు తెలుసుకున్న సురేష్ గుప్తా, ఆయన కుటుంబం తల్లడిల్లిపోయింది.