లక్నో: యువతలో మత విద్వేషం రగిల్చేందుకు బీజేపీ నేత ప్రయత్నించారు. వివాదస్పద ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) సినిమాను హిందూ యువతులకు ప్రత్యేకంగా చూపించారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి అభిజత్ మిశ్రా శనివారం లక్నోలోని ఒక థియేటర్లో ‘ది కేరళ స్టోరీ’ సినిమా ప్రదర్శనకు స్పాన్సర్ చేశారు. నవయుగ్ కన్యా పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీకి చెందిన వంద మంది హిందూ విద్యార్థినుల కోసం ప్రత్యేక షో ఏర్పాటు చేశారు. బీజేపీ నేత అభిజత్ మిశ్రా కూడా వారితో కలిసి ఈ సినిమా చూశారు. అనంతరం ఆయన ఒక ట్వీట్ చేశారు. హిందూ అమ్మాయిలను ‘లవ్ జిహాద్’ నుంచి రక్షించడానికి ‘ది కేరళ స్టోరీ’ సినిమాను వారికి చూపించినట్లు చెప్పారు. ‘అప్రమత్తంగా ఉండండి. సురక్షితంగా ఉండండి’ అని అందులో పేర్కొన్నారు.
కాగా, ముస్లిం అబ్బాయిల వలలో పడకుండా ‘లవ్ జిహాద్’ బారి నుంచి హిందూ యువతులను రక్షించడం చాలా ముఖ్యమని అభిజత్ మిశ్రా అన్నారు. లవ్ జిహాద్ అన్నది ప్రేమను అవమానించడమేనని వ్యాఖ్యానించారు. వారు (ముస్లింలు) మన (హిందూ) పిల్లలను దేశ వ్యతిరేకులుగా చేస్తున్నారని విమర్శించారు.
మరోవైపు హిందూ యువతులకు ప్రత్యేకంగా ‘ది కేరళ స్టోరీ’ సినిమాను బీజేపీ నేత చూపించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ కాలేజీ ప్రిన్సిపాల్ దీనిపై వివరణ ఇచ్చారు. ఆ సినిమా చూసిన విద్యార్థినుల నుంచి ముందస్తుగా వారి సమ్మతిని తీసుకొన్నట్లు చెప్పారు. వారి వెంట పలువురు టీచర్లు కూడా ఉన్నారని వెల్లడించారు.