చెన్నై, జనవరి 13: అయోధ్య ఆలయ నిర్మాణం నిజమైన లౌకిక వాదానికి చిహ్నమని బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ అన్నారు. అయోధ్య రామజన్మభూమిలో శ్రీరాముడి ఆలయ నిర్మాణమే లక్ష్యంగా 1990లో తాను రథయాత్ర చేపట్టానన్నారు. ‘శ్రీరామ మందిరం: దైవ స్వప్నం పూర్తి’ పేరుతో ఆయన రాసిన వ్యాసాన్ని శనివారం మీడియాకు విడుదల చేశారు. ‘ముస్లిం ఓట్లు పోతాయన్న భయంతో అనేక రాజకీయ పార్టీలు ‘అయోధ్య సమస్య’కు దూరంగా ఉన్నాయి.
ఆయా పార్టీలు ఓటు బ్యాంక్ రాజకీయాలకు లొంగిపోయి..తమ చర్యల్ని బూటకపు లౌకికవాదంతో సమర్థించుకున్నాయి’ అని వ్యాసంలో ఆనాటి రాజకీయ పార్టీల తీరును అద్వానీ విమర్శించారు. విగ్రహ ప్రతిష్ఠ నేపథ్యంలో దేశం యావత్తు రామ మాయ కమ్ముకున్నదని, ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తగానే కాదు..దేశ పౌరుడిగానూ ఇందుకు గర్వపడుతున్నానని అద్వానీ సంతోషం వ్యక్తం చేశారు. ‘శ్రీరాముడి ఆలయ నిర్మాణమనే లక్ష్యాన్ని రథయాత్ర నెరవేర్చింది. అంతేకాదు..బూటకపు లౌకికవాదం దాడి నుంచి.. నిజమైన లౌకికవాదాన్ని నిలబెట్టడంలోనూ ‘అయోధ్య సమస్య’ సక్సెస్ అయ్యింది. నిజమైన అర్థానికి నిలువెత్తు చిహ్నంగా మారింది’ అని అన్నారు.
కాశీలో 40 రోజులపాటు పూజలు
తమిళనాడులోని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామిగల్ విగ్రహ ప్రతిష్ఠ వేడుకకు హాజరు కావటం లేదని తెలిసింది. కాశీలోని యజ్ఞశాలలో 40 రోజులపాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపడతున్నామని, 100 మందికిపైగా వైదిక పండితుల ఆధ్వర్యంలో జనవరి 22న యజ్ఞశాలలో పూజలు మొదలవుతాయని తెలిపారు. ఇదిలా ఉండగా, ‘శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ’ కార్యక్రమానికి నలుగురు శంకరాచార్యులు హాజరుకావటం లేదన్న మీడియా కథనాల్ని పూరి శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి ఖండించారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంపై తమ మధ్య ఎలాంటి విభేదాల్లేవన్నారు.
ప్రాణ ప్రతిష్ఠ తీరుపై నిర్మోహి అఖాడా ఆగ్రహం
అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ సరిగా జరగడం లేదని నిర్మోహీ అఖాడా తెలిపింది. శ్రీరామ జన్మభూమి-బాబ్రీ మసీ దు కేసులో ప్రధాన పిటిషనర్లలో నిర్మోహీ అఖాడా ఒకటి. ఈ నెల 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం రామానంది సంప్రదాయానికి అనుగుణంగా జరగడం లేదని, మిశ్రమ సంప్రదాయాన్ని పాటిస్తున్నారని నిర్మోహీ అఖాడా సీనియర్ మహంత్ తెలిపారు. బొట్టు, ఇతర చిహ్నాలు రామానంది సంప్రదాయంలో విభిన్నంగా ఉంటాయన్నారు.
అతిథులకు ‘రామ్రాజ్’ మట్టి
జనవరి 22నాటి కార్యక్రమంలో పాల్గొనే అతిథులకు ‘రామ్ రాజ్’ మట్టిని బహుమతిగా ఇవ్వబోతున్నామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. దేశ విదేశాలకు చెందిన 11 వేలమందికిపైగా అతిథులకు ఆహ్వానాలు పంపారు. వీళ్లందరికీ ఆలయం శంకుస్థాపన వేళ తవ్విన మట్టిని (రామ్ రాజ్), మోతిచూర్ లడ్డు ప్రసాదాన్ని ట్రస్ట్ తరఫున ఇవ్వబోతున్నట్టు ట్రస్ట్ సభ్యుడు ఒకరు తెలిపారు.