న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. రాజధానిలో మయూర్ విహార్ ప్రాంతంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ నేత జీతు చౌదరిని (Jeetu Choudhary) దుండగులు తుపాకీతో కాల్చి వేశారు. అదేసమయంలో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడిఉన్న చౌదరిని దవాఖానకు తరలించగా.. అప్పటికే మరణించాడని వైద్యులు చెప్పారు. మయూర్ విహార్లో బుధవారం రాత్రి 8.15 గంటలకు ఈ హత్య జరిగిందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఖాళీగా ఉన్న కాట్రిజ్లు, ఇతర ఆధారాలను సేకరించామన్నారు. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు.
కాగా, జహంగీర్పురిలో ఉన్న అక్రమ కట్టడాలను ఎన్డీఎంసీ అధికారులు కూల్చివేసిన రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. బుధవారం అక్రమ నిర్మాణాల కూల్చివేత డ్రైవ్ను ఎన్డీఎంసీ అధికారులు ప్రారంభించారు. ఉదయమే పది బుల్డోజర్లు, వందలాది మంది అధికారులు, సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకొన్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయబోతున్నట్టు అప్పుడే సమాచారం మిచ్చారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో కూల్చివేతలను అధికారులు నిలిపివేశారు.