Jyotiraditya Scindia | కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా క్రికెట్ బ్యాట్తో చెలరేగాడు. బౌలర్ వేసిన బంతిని బలంగా బాదాడు. దాంతో అది కాస్తా వెళ్లి అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న యువ మోర్చ నేత తలకు తగిలింది. దాంతో కంటి పైభాగంలో తీవ్రమైన గాయమైంది. వెంటనే అతడ్ని సంజయ్గాంధీ దవాఖానకు చికిత్స నిమిత్తం తరలించారు. సింధియా స్వయంగా దవాఖానకు వచ్చి సదరు యువ నాయకుడ్ని పరామర్శించారు. అంతకుముందు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి సింధియా రేవా విమానాశ్రయానికి భూమి పూజ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని రేవా పట్టణంలో జరిగింది.
మధ్యప్రదేశ్లోని రేవాలో నిర్మించిన మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్ను ప్రారంభించేందుకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటౌరా వచ్చారు. అక్కడి క్రికెటర్లను ఉత్సాహపరిచేందుకు సింధియా బ్యాట్ పట్టుకున్నాడు. ఓ బౌలర్ బంతిని వేయగా సింధియా దంచికొట్టాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న బీజేపీ యువ మోర్చ మండల శాఖ ఉపాధ్యక్షుడు వికాస్ మిశ్రా క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించాడు. అది కాస్తా మిస్ కావడంతో కంటి పైభాగంలో బంతి బలంగా తాకింది. రక్తం కారడంతో అతడ్ని సంజయ్గాంధీ దవాఖానకు తరలించారు. సింధియా దవాఖానకు వెళ్లి వికాస్ మిశ్రా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ స్టేడియంను మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ నిర్మించింది. రేవా డివిజనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సంఘం పాట్రన్ నాగేంద్ర సింగ్, ఎమ్మెల్యే గుర్హ్, అధ్యక్షుడు కేకే సింగ్ తదితరులు ఈ ప్రారంభోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఇలాఉండగా, దివంగత మాధవరావు సింధియాతోపాటు జ్యోతిరాదిత్య సింధియా కూడా ఎంపీసీఏ అధ్యక్షులుగా పనిచేశారు. జ్యోతిరాదిత్య కుమారుడు మహార్యామన్ సింధియా ప్రస్తుతం ఎంపీసీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు.