ముంబై, జూన్ 28: మొన్నటిదాకా శివసేన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించిన బీజేపీ.. ఇప్పుడు మహారాష్ట్ర పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని తాజా పరిణామాలను అధిష్ఠానానికి వివరించడానికి మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీ వెళ్లారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. అనంతరం గవర్నర్ బీఎస్ కొశ్యారీని రాజ్భవన్లో కలిశారు. అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని ఉద్ధవ్ ఠాక్రేను ఆదేశించాల్సిందిగా కోరారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘శివసేనకు చెందిన 39 మంది రెబల్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకొన్నట్టు ఇప్పటికే చెప్పారు. దీంతో వెంటనే బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్ను కోరాం. ఈ మేరకు లేఖను సమర్పించాం’ అని ఫడ్నవీస్ వెల్లడించారు. మరోవైపు, శివసేనకు చెందిన 14 మంది ఎంపీలు తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండేతో పాటు బీజేపీతో టచ్లో ఉన్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. వీరంతా షిండే క్యాంప్లో చేరనున్నట్టు తెలుస్తున్నది.
రండి.. కూర్చొని మాట్లాడుకుందాం..
రెబల్స్ను బుజ్జగించేందుకు శివసేన అధినేత, సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రెబల్ ఎమ్మెల్యేలంతా గువాహటి నుంచి ముంబైకి తిరిగిరావాలని, సమస్యలను కూర్చొని చర్చల ద్వారా పరిష్కరించుకుందామని సూచించారు. ‘ఇంకా సమయం మించిపోలేదు. ముంబైకి వచ్చి నా ఎదురుగా కూర్చొని మాట్లాడండి. ఎవరి మాటలకూ లొంగిపోవద్దు. మీలో చాలా మంది ఇప్పటికీ మాతో టచ్లో ఉన్నారు. అంతేకాకుండా మీరంతా శివసేన గుండెల్లో ఉన్నారు. తాజా పరిణామాలతో శివసైనికులు, ప్రజల్లో ఏర్పడిన సందేహాలను తొలగించాల్సిన అవసరం ఉన్నది. శివసేన మీకు ఇచ్చిన గౌరవం మరెక్కడా లభించదు. ఒక పార్టీ అధ్యక్షుడిగా, కుటుంబ పెద్దగా ఆందోళనతో ఉన్నా. మీరు వచ్చి నాతో మాట్లాడితే ఏదో ఒక పరిష్కారం తప్పకుండా లభిస్తుంది’ అన్నారు. మరోవైపు, సమాజంలో అశాంతిని రేపుతూ, దేశద్రోహానికి పాల్పడుతున్నారంటూ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, మంత్రి ఆదిత్య ఠాక్రే, ఎంపీ సంజయ్ రౌత్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బాంబే హైకోర్టులో పిల్ దాఖలైంది. మనీలాండరింగ్ కేసులో రౌత్కు ఈడీ మళ్లీ నోటీసులిచ్చింది.
త్వరలో ముంబైకి వస్తున్నా..
రెబల్స్లో సగానికి పైగామంది తమతో సంప్రదింపులు జరుపుతున్నారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. గువాహటి హోటల్లో వారిని బలవంతంగా నిర్బంధించారని ఆరోపించారు. దీనిపై షిండే కౌంటర్ ఇచ్చారు. హిందూత్వను ముందుకు తీసుకురావడానికే ఎమ్మెల్యేలంతా స్వచ్ఛందంగా వచ్చారని పేర్కొన్నారు. 20 మందికి పైగా రెబల్స్ టచ్లో ఉన్నట్టు ఎంవీఏ చెబుతున్నది నిజమైతే వారి పేర్లు వెల్లడించాలని సవాల్ విసిరారు. త్వరలో తాను ముంబై వస్తానని, అప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు.