న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పందంలో ప్రమేయమున్న దళారులకు 2007 నుంచి 2012 మధ్య ముడుపులు ముట్టాయని ఫ్రాన్స్ పత్రిక ఆరోపించిన నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా బీజేపీ నేత సంబిట్ పాత్ర విమర్శలు గుప్పించారు. ఐఎన్సీ (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) అంటే ‘ఐ నీడ్ కమిషన్’ అని అర్ధమని ఎద్దేవా చేశారు. 2014కు ముందు యూపీఏ హయాంలో జరిగిన అవినీతిపై సంబిట్ పాత్ర ధ్వజమెత్తారు. ఫ్రెంచ్ ఇన్వెస్టిగేటివ్ జర్నల్ మీడియాపార్ట్ తాజాగా వెల్లడించిన అంశాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బదులివ్వాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఈ కుంభకోణం జరిగిందని తాజాగా వెల్లడైందని పేర్కొన్నారు. పదేండ్ల కిందట జరిగిన ఈ వ్యవహారం ఒప్పందం కోసం కాదని కమిషన్ల కోసమని ఆరోపించారు. కొనుగోలు కోసం ఒప్పందం మనం చూడలేదని, దళారులకు 40 శాతం కమిషన్ చెల్లించేలా ఒప్పందం జరిగిందని బీజేపీ నేత పేర్కొన్నారు. ఈ అవినీతి చిరునామా 10 జన్పధ్ అని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ చిరునామా అనాధగా మారిందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అధికార నివాసాన్ని ప్రస్తావిస్తూ సంబిట్ పాత్ర వ్యాఖ్యానించారు.