BJP | హైదరాబాద్, మార్చి 25 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల్లో లబ్ధిపొందడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్నది. ఓటర్లను ఆకర్షించడం కోసం ఒకవైపు సినీతారలను బరిలోకి దించుతూనే.. ప్రజలపై ప్రభావం చూపించే కొన్ని సినిమాలను వ్యూహాత్మకంగా తెరమీదకు తీసుకువస్తున్నది.. రాజకీయంగా ఆ పార్టీకి ఉపయోగపడే కాన్సెప్ట్లతో కొన్ని చలనచిత్రాలు ఈ ఎన్నికల వేళ విడుదలవుతుండటమే దీనికి నిదర్శనం. బీజేపీకి చెందిన నేతలు, సానుభూతిపరులు ఆయా చిత్రాల నిర్మాణంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకొంటుండటం గమనార్హం.
మై అటల్ హూఁ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయీ జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. వాజపేయీ వ్యక్తిగత జీవితం, రాజకీయ రంగప్రవేశం, కార్గిల్ యుద్ధం, పోఖ్రాన్ అణుపరీక్ష తదితర కీలక అంశాలను చిత్రంలో చూపించారు.
ఆర్టికల్ 370: జమ్ముకశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370 రద్దు, ఆ తర్వాత జరిగిన పరిణామాల సదృశ్యరూపమే ఈ చిత్రం. అయితే, వాస్తవాలను విస్మరించి కేవలం బీజేపీకి లబ్ధి చేకూర్చే విధంగా చిత్రంలో కొన్ని సీన్స్ను వక్రీకరించారన్న విమర్శలు వచ్చాయి.
స్వతంత్ర వీర్ సావర్కర్: రణ్దీప్ హుడా టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రం బీజేపీ భావజాలాన్ని వ్యాపితం చేయడానికి మాత్రమే ఉద్దేశించిందని విమర్శలు వ్యక్తమయ్యాయి. స్వతంత్య్ర పోరాట వీరుల చరిత్రను వక్రీకరించిందంటూ పలువురు మండిపడ్డారు.
జేఎన్యూ జహంగీర్ నేషనల్ యూనివర్సిటీ: ఢిల్లీలోని జేఎన్యూ యూనివర్సిటీలో 2016, ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తీసుకొచ్చారు. విపక్షాలను ముఖ్యంగా లెఫ్ట్ కూటమిని లక్ష్యంగా చేసుకొని ఈ సినిమాను తీసుకొచ్చినట్టు విమర్శలు ఉన్నాయి.
ఎమర్జెన్సీ: బీజేపీ నుంచి ఇటీవల ఎంపీ టికెట్ పొందిన బాలీవుడ్ నటి కంగన రనౌత్.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను పోషించారు. 1975-77 మధ్య విధించిన అత్యయిక స్థితి ఆధారంగా ఈ సినిమా తెరకెక్కినట్టు సమాచారం. కాంగ్రెస్ను లక్ష్యంగా చేసుకొనే ఈ సినిమా తీసినట్టు విమర్శలు ఉన్నాయి.
ఈ సినిమాలు కూడా: పై చిత్రాలతో పాటు తెలుగులో ఇటీవల వచ్చిన రజాకార్, బాలీవుడ్లో తెరకెక్కిన బెంగాల్ 1947, బస్తర్ ది నక్సల్ స్టోరీ, ది సబర్మతీ రిపోర్ట్తో పాటు గతంలో వచ్చిన కశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ చిత్రాల నేపథ్యాలు ఒక విధంగా బీజేపీకి అనుకూలంగా ఉన్నట్టు విమర్శలు వచ్చాయి.
సినీ స్టార్లకు టికెట్ ఇవ్వడం లేదా ప్రచారంలో వాడుకోవడం ద్వారా రానున్న లోక్సభ ఎన్నికల్లో ఓట్లు రాబట్టేందుకు బీజేపీ సిద్ధమైంది. పొలిటికల్ సినీ తారల జాబితాలో నటి కంగనా రనౌత్, రామాయణ్ సీరియల్ పాత్రధారి అరుణ్ గోవిల్, రేసుగుర్రం విలన్ రవికిషన్, ప్రముఖ నటి హేమామాలిని, మలయాళం నటుడు సురేశ్ గోపీ తదితరులు ఉన్నారు.