బెంగళూరు, నవంబర్ 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కర్ణాటకలో రౌడీషీటర్లకు ఆశ్రయ కేంద్రంగా బీజేపీ మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం బెంగళూరులో జరిగిన రక్తదాన శిబిరం కార్యక్రమంలో పలువురు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు స్లైంట్ సునీల్ అనే రౌడీషీటర్తో కలిసి వేదిక పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఎంపీలు పీసీ మోహన్, తేజస్వీ సూర్య, చిక్పేట్ ఎమ్మెల్యే ఉదయ్ గారుదహర్, బెంగళూరు సౌత్ బీజేపీ అధ్యక్షుడు ఎన్ఆర్ రమేష్తో సునీల్ కనిపించాడు. ఈనెల 23న నగరంలోని రౌడీషీటర్ల నివాసాలపై పోలీసులు మెరుపు దాడులు జరిపిన సమయంలో సునీల్ తన ఇంటి నుంచి పారిపోయాడు. ఇది జరిగిన రెండోరోజే సంఘ్ పరివార్ ఆధ్వర్యంలోని రక్తదాన శిబిరంలో దర్శనమిచ్చాడు. ఆ శిబిరం నిర్వహణకు అతను కూడా ఓ స్పాన్సర్ అని పోలీసులు చెప్పారు. కనిపించిన వెంటనే అరెస్టు చేయాల్సిన రౌడీషీటర్ సునీల్ను పోలీసులే కాపాడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ మధ్యనే ఫైటర్ రవి అనే మరో రౌడీషీటర్ను బీజేపీ తన పార్టీలో చేర్చుకొన్నది. మంత్రులు గోపాలయ్య, అశ్వత్థ నారాయణ, మాజీమంత్రి యోగీశ్వర్ సమక్షంలో ఆయనకు కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించడం మరింత చర్చ రేపింది.