న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో ఓట్ల కోసం బీజేపీ తాపత్రయ పడుతున్నదని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్టు (సీపీఐ-ఎం) జనరల్ సెక్రెటరీ సీతారాం ఏచూరి విమర్శించారు. అందుకే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నదని చెప్పారు. ఈ ఉదయం ఉత్తరప్రదేశ్లో ప్రధాని మోదీ 341 కిలోమీటర్ల పొడవైన ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించారు. ఈ విషయాన్ని ఓ జాతీయ మీడియా సంస్థ ప్రతినిధి ఏచూరి ముందు ప్రస్తావించగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడింది. దాంతో మోదీ ప్రభుత్వం ప్రారంభోత్సవాల మీద ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల మీద శంకుస్థాపనలు చేస్తున్నది. బీజేపీ నేతలు ఇదంతా చేస్తున్నది యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసమే. చివరికి ఈ నూతన ప్రాజెక్టులు అమలైతయో.. లేదో.. అని సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. యూపీలో బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని, ఇది గమనించే బీజేపీ నేతలు పలు నూతన ప్రాజెక్టులను ప్రారంభిస్తూ ఓటర్లను మభ్యపెడుతున్నారని విమర్శించారు.