చండీగఢ్, సెప్టెంబర్ 13: పంజాబ్లో భగవంత్మాన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నేతలు కుట్ర చేస్తున్నారని, పది మంది ఆప్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.20-25 కోట్ల ఆఫర్ ప్రకటించారని ఆప్ సర్కారు ఆరోపించింది. ‘ఆపరేషన్ కమలం’లో భాగంగా బీజేపీ అధిష్ఠానం ఆదేశాలతో ఎమ్మెల్యేల కొనుగోలుకు ఆ పార్టీ నేతలు తెరలేపారని విమర్శించింది. ఏడు నుంచి పది మంది ఆప్ ఎమ్మెల్యేలకు భారీగా డబ్బుతోపాటు మంత్రి పదవులు ఇస్తామని బీజేపీ నేతలు ఆశ చూపుతున్నట్టు పంజాబ్ ఆర్థిక శాఖ మంత్రి హర్పాల్ సింగ్ చీమా ఆరోపించారు. ఆప్ ఆరోపణలపై బీజేపీ ఇప్పటివరకు స్పందించలేదు.
‘బీజేపీ కేంద్ర అధిష్ఠానం ఆదేశం మేరకు కొందరు కమలం నేతలు పంజాబ్కు చెందిన మా ఎమ్మెల్యేలను ఫోన్లలో సంప్రదిస్తున్నారు. ఆప్ సర్కారును కూల్చితే ఒక్కొక్కరికి రూ.25 కోట్ల ఆఫర్ ప్రకటించారు. ఎక్కువ మందిని తీసుకొస్తే మరింత ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. గతంలో ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వ పడగొట్టాలని బీజేపీ నేతలు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇప్పుడు పంజాబ్లో ఆప్ ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు బయటపెడతాం’ అని మంత్రి హర్పాల్సింగ్ చీమా పేర్కొన్నారు.
ఢిల్లీలోనూ బీజేపీ ఇదే తీరు
గతంలో ఢిల్లీలోని ఆప్ సర్కారును కూల్చేందుకు కూడా బీజేపీ కుట్ర చేసింది. తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసిందని, అందులోభాగంగానే డిప్యూటీ సీఎం సిసోడియా ఇంట్లో దర్యాప్తు సంస్థలతో సోదాలు నిర్వహించిందని ఆ పార్టీ నేతలు విమర్శించారు.