Karntaka elections | బెంగళూరు, మే 12: ‘కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలున్నాయన్న ఎగ్జిట్ పోల్ అంచనాలతో అధికార బీజేపీలో కలవరం మొదలైంది. కౌంటింగ్కు ముందే ఆ పార్టీ ‘ఆపరేషన్ లోటస్’కు తెర తీసింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ పార్టీ నేత, ఆ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అశోక శుక్రవారం బహిరంగంగానే మీడియాకు వెల్లడించారు. పైగా ఈ ‘ఆపరేషన్’కు జాతీయ అధిష్ఠానం అండదండలు, ఆశీస్సులు ఉన్నాయని చెప్పుకోవడం గమనార్హం. గత ఎన్నికల్లో మెజార్టీ రాకపోయినా, అత్యధిక స్థానాలు గెలుచుకున్న కమలం పార్టీ ఆపరేషన్ లోటస్ వ్యూహంతోనే కాంగ్రెస్-జేడీ(ఎస్) ప్రభుత్వాన్ని కొన్ని నెలలకే పడగొట్టి అధికారాన్ని సొంతం చేసుకుంది. ఈసారి ఎన్నికల్లో కూడా అదే వ్యూహాన్ని అమలు చేయాలని పన్నాగం పన్నుతున్నది. ప్రజాతీర్పును శిరసావహించకుండా ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బీజేపీ తెరతీయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది రాజకీయ దిగజారుడుతనమని, తెలంగాణలో కర్రు కాల్చి వాతపెట్టినా ఆ పార్టీ కుటిల రాజకీయాలు మానడం లేదని బుద్ధిజీవులు మండిపడుతున్నారు.
మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఎలా, ఎప్పుడునేది అడగొద్దు. ప్లాన్-బీ గురించి కేంద్ర, రాష్ట్ర నాయకులతో చర్చిస్తాం’ అంటూ కర్ణాటక రెవెన్యూ మంత్రి అశోక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో కలకలం రేపుతున్నాయి. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలున్నాయన్న ఎగ్జిట్ పోల్ అంచనాలతో అధికార బీజేపీలో కలవరం మొదలైంది. నిస్సిగ్గుగా కౌంటింగ్కు ముందే ఆ పార్టీ ‘ఆపరేషన్ లోటస్’కు తెర తీసింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ సమాయత్తమవుతున్నదని.. అశోక చేసిన ‘ప్లాన్-బీ’ వాఖ్యలను బట్టి అర్థమవుతున్నది. ఆయన వ్యాఖ్యల్ని ఆ పార్టీ నాయకుల సమాలోచనలు బలపరుస్తున్నాయి. శుక్రవారం మాజీ సీఎం యెడియూరప్ప నివాసంలో కర్ణాటక సీఎం బి.బొమ్మై పార్టీ కీలక నేతలతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కాంగ్రెస్కు స్వల్ప అధిక్యం లభిస్తున్నదని చెప్పిన తర్వాత కూడా యెడియూరప్ప తమ పార్టీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటుదని గురువారం మీడియాతో అన్నారు. ఒకవేళ మెజారిటీకి కొద్ది దూరంలో తమ పార్టీ ఆగిపోతే, జేడీ(ఎస్)తో పొత్తు పెట్టుకుంటారా అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ… ఆ విషయంపై పార్టీ జాతీయ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుదని అన్నారు.
గత అనుభవాలతో అప్రమత్తం
మరోవైపు గత అనుభవాల నేపథ్యంలో తమ పార్టీ తరపున ఎన్నికయ్యే ఎమ్మెల్యేలను జాతీయ పార్టీలు కొనుగోలు చేస్తాయన్న భయంతో జేడీ(ఎస్) అగ్రనేతలు తమ పార్టీ అభ్యర్థులపై నిఘా ఉంచారు. ముఖ్యంగా ఎన్నికల ముందు కాంగ్రెస్, బీజేపీ నుంచి ఫిరాయించిన అభ్యర్థుల కదలికలను జేడీ(ఎస్) అగ్రనేతలు దేవెగౌడ, కుమారస్వామి నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇంకోవైపు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు శివకుమార్ తమ పార్టీకి సొంతంగా 141 సీట్లు వస్తాయని ఘంటాపథంగా చెప్తున్నారు. ఎందుకైనా మంచిదని హస్తం పార్టీ రివర్స్ ఆపరేషన్ చేపట్టింది. తమ ఎమ్మెల్యేలు చేజారకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నది. గెలిచే అభ్యర్థులంతా ప్రభుత్వం ఏర్పడే వరకు బెంగళూరులో అధిష్ఠానం చెప్పిన ప్రాంతంలో బస చేయాలని ఆదేశించింది.
హంగ్ వస్తే జేడీఎస్ ఎటువైపు?
రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు తలెత్తితే, తమ వద్ద ఉన్న చెప్పుకోదగ్గ ఎమ్మెల్యేల సంఖ్యతో అనుకున్న డిమాండ్లు సాధించవచ్చని జేడీ(ఎస్) భావిస్తున్నది. సీఎం పదవిని మాకే ఇవ్వాలనే డిమాండ్తో కాంగ్రెస్తోనైనా, బీజేపీతోనైనా పొత్తు పెట్టుకొనే సూచనలున్నాయని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
కౌంటింగ్కు పటిష్ఠ భద్రత
నేడు(శనివారం) జరిగే శాసన సభ ఎన్నికల కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్ఠమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపు ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
స్వతంత్రులకు గాలం..‘గెలిచేవారి’ సమీకరణ
గత ఎన్నికల అనుభవాల నేపథ్యంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే అంశంపై కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ చాలా ముందు జాగ్రత్తతో ఉన్నాయి. గెలిచే అవకాశాలున్న స్వతంత్ర అభ్యర్థులకు, తమ పార్టీ తిరుగుబాటు అభ్యర్థులకు అవి గాలం వేస్తున్నాయి. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు శుక్రవారం ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు ఖర్గే నివాసంలో సమావేశమై చర్చించారు. తమ పార్టీ తరపున గెలిచే అవకాశాలున్న అభ్యర్థులను ఒకచోటికి చేర్చాలని నిర్ణయించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎవరైనా ఎగరేసుకుపోవచ్చు కదా అన్న ప్రశ్నపై కాంగ్రెస్ సీనియర్ నేత పరమేశ్వర స్పందిస్తూ ఈసారి తాము జాగ్రత్తగా ఉంటామన్నారు. ఫలితాలు వెలువడుతున్న తరుణంలోనే గెలిచే అవకాశాలున్న పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు వెంటనే బెంగళూరుకు చేరుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించింది. బీజేపీ తాయిలాలకు ఆశ పడవద్దని వారిని హెచ్చరించారు. మరోవైపు బీజేపీ కూడా కాంగ్రెస్లాగే స్వతంత్ర అభ్యర్థుల మద్దతు సంపాదించే పనిలో ఉంది. జేడీ(ఎస్) కూడా తమ పార్టీ తరపున ఎన్నికయ్యే ఎమ్మెల్యేలను ఒక్కచోట చేర్చాలని నిర్ణయించింది.