బెంగళూరు, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజం నిప్పులాంటిది.. అది ఎన్నటికైనా బయటపడాల్సిందే.. ఎక్కువకాలం ఎవరూ దాన్ని దాచలేరు. తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుతో తమకు సంబంధమే లేదన్న బీజేపీ వాదనంతా పచ్చి బుకాయింపని తేలిపోయింది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ.. అనేక రాష్ర్టాల్లో విపక్ష పార్టీల ప్రభుత్వాలను బీజేపీ దుర్మార్గంగా కూల్చివేసిన నిజం బట్టబయలైంది. బీజేపీ నేతలు విపక్ష ఎమ్మెల్యేలకు ఎలా వల వేస్తారు? ప్రభుత్వాలను ఎలా కూలుస్తారు? కోట్లకొద్దీ డబ్బు ఎలా కుమ్మరిస్తారు? అన్న విషయాన్ని వారి ప్రలోభాలకు లోనైన నాయకుడే స్వయంగా బయటపెట్టారు. మూడేండ్ల కిందట కర్ణాటకలో ‘ఆపరేషన్ కమల’ పేరుతో బీజేపీ నిర్వహించిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఎలా జరిగిందనే విషయాన్ని.. ఆ ఆపరేషన్లో భాగమై పార్టీ మారిన నాటి ఎమ్మెల్యే, నేటి ఎమ్మెల్సీ ఏ హెచ్ విశ్వనాథ్ పూసగుచ్చినట్టు మీడియా ముందే వివరించారు.
యడియూరప్ప కుమారుడి ఇంట్లోనే కుట్ర
కర్ణాటకలో 2019లో అధికారంలో ఉన్న కాంగ్రెస్- జేడీఎస్ ప్రభుత్వాన్ని చట్ట విరుద్ధంగా కూల్చి బీజేపీ అధికారంలోకి వచ్చింది. అందుకోసం పదిమంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను కోట్ల రూపాయలు కుమ్మరించి సంతలో పశువుల్లా కొనుగోలు చేసిందనే ఆరోపణలు వచ్చాయి. కానీ, వారు ఇష్టపూర్వకంగా తమ పార్టీలోచేరారని నాడు బీజేపీ బొంకింది. మూడేండ్ల తర్వాత అసలు నిజం బయటకు వచ్చింది. నాడు జేడీఎస్ ఎమ్మెల్యేగా ఉండి బీజేపీ ఆపరేషన్ కమలలో భాగస్వామి అయ్యి ఆ పార్టీలో చేరిన ఏహెచ్ విశ్వనాథ్.. నాడు ఏం జరిగిందో గురువారం మైసూరులో మీడియా సమావేశం పెట్టి మరీ బయటపెట్టారు. ‘నాడు మాజీ బీజేపీ నేత, ముఖ్యమంత్రి యెడియూరప్ప కుమారుడు విజయేంద్రకు చెందిన ఆపార్ట్మెంటులోనే భాజపాలో చేరే విషయమై చర్చలు జరిగాయి. అకడ విజయేంద్ర నాకు డబ్బులు ఇవ్వడానికి స్వయంగా వచ్చాడు. త్వరలో విడుదల కానునంన నా పుస్తకం ‘బాంబే డేస్’లో ఆపరేషన్ కమలపై మరింత వివరంగా తెలుసుకోవచ్చు. నన్ను బీజేపీలో తీసుకెళ్లేందుకు లోక్సభ సభ్యుడు శ్రీనివాస ప్రసాద్ రాయబారం నడిపారు.
నాటి చర్చల్లో యెడియూరప్ప, మాజీ మంత్రి రమేశ్ జార్ఖిహొళి, విజయేంద్ర పాల్గొన్నారు. యెడియూరప్పను ముఖ్యమంత్రిని చేసేందుకు భాజపాలో చేరాలని నాపై ఒత్తడి తెచ్చారు. శ్రీనివాస ప్రసాద్తో నాకు ఉన్న స్నేహానికి కట్టుబడి వారి ఆహ్వానాన్ని తోసిపుచ్చలేక భాజపాలో చేరాను. ఆ సమయంలో డబ్బు తీసుకోవాలని నాకు ఆఫర్ ఇచ్చారు. కానీ, కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చిన తర్వాత యడియూరప్పగానీ, శ్రీనివాస ప్రసాద్గానీ నాకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. ఇద్దరూ ఏరు దాటి తెప్ప తగలేసినట్టు వ్యవహరించారు. పార్టీ మారిన తర్వాత జరిగిన శాసనసభ ఉప ఎన్నికల్లో నేను ఓడిపోయాను. పార్టీ మారితే ఓడిపోయినా ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇస్తామని నాడు హామీ ఇచ్చి మోసం చేశారు. కనీసం ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వలేదు. అయితే ఆర్ఎస్ఎస్ నేత ముకుంద చొరవ తీసుకొని ఎమ్మెల్సీ పదవి ఇప్చించారు.
శ్రీనివాస ప్రసాద్ రాజకీయ సంచారులకు రాజు
చామరాజనగర బీజేపీ ఎంపీ, 2019లో తనను బీజేపీలో చేరేలా చేసిన శ్రీనివాస ప్రసాద్పై విశ్వనాథ్ తీవ్ర విమర్శలు చేశారు. తనను రాజకీయ సంచారి అన్న శ్రీనివాస వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ‘శ్రీనివాస ప్రసాద్ రాజకీయ సంచారులకు రాజు. కానీ ఇప్పటికీ నేను బీజేపీలోనే ఉన్నాను’ అని తెలిపారు.