న్యూఢిల్లీ, నవంబర్ 23: ఊరికి కాపలా కాసే కుక్కను చంపాలంటే అది పిచ్చిదని ముద్ర వేయాలి.. ఇది జగమెరిగిన ఫ్రెంచ్ సామెత. ప్రత్యర్థి పార్టీని ఎన్నికల్లో ఓడించాలంటే.. దానిపై అవినీతి ముద్ర వేయాలి.. అబద్ధాలు పేర్చయినా సరే నిత్యం బురద చల్లాలి.. ఇది మనదేశంలో బీజేపీ ప్రవచిస్తున్న సిద్ధాంతం. బురద జల్లుడు.. బద్నాం చేసుడు.. నిరూపణలతో పనిలేదు.. ఒక్క ఆరోపణా నిలబడ్డది లేదు.. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలని పట్టుదలగా ఉన్న కమల దళం.. అక్కడ అధికారంలో ఉన్న ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్)పై ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్నది. ఆప్పై అవినీతి ముద్ర వేసేందుకు పక్కాగా ప్లాన్ వేసి.. అమలు కూడా మొదలుపెట్టేసిందని తెలుస్తున్నది. ఈ ప్లాన్ సృష్టికర్త కూడా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోషేనని సమాచారం. బీజేపీ కుతంత్రంపై ‘ది ప్రింట్’ మంగళవారం పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. పలువురు బీజేపీ నేతలు స్వయంగా చెప్పిన విషయాల ఆధారంగానే ఈ కథనాన్ని ప్రచురించటం గమనార్హం.
రోజూ అవినీతి ఆరోపణలు
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం ఢిల్లీలో వరుసగా మూడోసారి అధికారంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆప్ మూలసూత్రమే అవినీతి నిర్మూలన. ఇప్పుడు బీజేపీ ఈ సూత్రాన్నే ఆధారం చేసుకొని ఆప్ను నామరూపాల్లేకుండా చేయాలని ప్రణాళిక వేసిందని నీలంపాండే తన కథనంలో పేర్కొన్నారు. ఎంసీడీ ఎన్నికలపై వ్యూహ రచనకోసం ఢిల్లీ బీజేపీ నేతలు బైజయంత్ పాండే, సునీల్ దేవ్ధర్, ఆదేశ్గుప్తాతో బీఎల్ సంతోష్ ఈ నెల 5న ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. 14వ తేదీన మరోసారి భేటీ నిర్వహించారు. ఈ రెండు సమావేశాల్లోనూ బీఎల్ సంతోష్ ఒకటే సూత్రం చెప్పారని సమాచారం. అదే.. ఆప్పై అవినీతి ముద్ర.
ఈ నెల 7న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఎంసీడీ ఎన్నికలపై పార్టీ నేతలతో సమావేశం నిర్వహించి ఇదే ప్రణాళికను వివరించినట్టు ప్రింట్ కథనంలో పేర్కొన్నారు. ఈ ప్లాన్ ప్రకారం బీజేపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి ఆప్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేయాలి. ప్రజల్లో ఆప్పై అనుమానాలు రేకెత్తేలా చేయాలి. పదేపదే అవినీతి ఆరోపణలు చేస్తే న్యూట్రల్గా ఉండే ఓటర్లు క్రమంగా ఆప్ను వ్యతిరేకించి బీజేపీవైపు మళ్లుతారనేది ఆ పార్టీ నేతల ఉద్దేశం. ఈ ప్లాన్ను బీజేపీ ఇప్పటికే అమల్లో పెట్టింది. సోమవారం మీడియా సమావేశం పెట్టిన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్పాత్రా.. ఎన్నికల్లో టికెట్ల కోసం ఆప్ ముడుపులు తీసుకొంటున్నదని ఆరోపించారు.
ఓ జూనియర్ ఇంజినీర్ నుంచి ఆప్ నేత ముఖేశ్గోయల్ రూ.కోటి డిమాండ్ చేశారని గత శుక్రవారం బీజేపీ నేతలు మరో ఆరోపణ ముందుకు తెచ్చారు. ఎంసీడీ ఎన్నికల్లో తమ ప్రధాన ఆయుధం లిక్కర్ అంశాన్ని కుంభకోణంగా తీసుకెళ్లడమేనని ఓ బీజేపీ నేత వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఢిల్లీ డిఫ్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ ఇప్పటికే ప్రశ్నించింది. ‘అవినీతి నిర్మూలన పేరుతో అధికారంలోకి వచ్చిన ఆప్ను దెబ్బతీయటానికి మాకు ప్రస్తుతం ఉన్న ఏకైక ఆయుధం లిక్కర్ అంశం. దానిని మేం ప్రధానంగా వాడబోతున్నాం. దీనితోపాటు మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే జైల్లో ఉన్న ఆప్ నేత సత్యేంద్రజైన్తోపాటు మనీశ్ సిసోడియా వంటివారిపై మరింత ఒత్తిడి పెంచబోతున్నాం’ అని ఓ బీజేపీ నేత చెప్పారని ప్రింట్ కథనంలో వెల్లడించారు.
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు
ఆప్పై అవినీతి ముంద్ర వేయాలని బీజేపీ ప్రణాళిక వేయటం వెనుక రెండు ప్రయోజనాలు ఉన్నట్టు కనిపిస్తున్నది. ప్రస్తుతం జరుగుతున్న గుజరాత్ ఎన్నికల్లో గత 22 ఏండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి ఆప్ చెమటలు పట్టిస్తున్నది. కాంగ్రెస్ను వెనక్కు నెట్టి రాష్ట్రంలో ఆప్ ప్రధాన ప్రతిపక్షంగా ఎదగనున్నదని సర్వేలు చెప్తున్నాయి. దీంతోపాటు ఢిల్లీలో ఇప్పుడు ఓటర్లు ఇటు ఆప్వైపుగానీ, బీజేపీ వైపుగానీ మొగ్గు చూపటంలేదని బీజేపీ నిర్వహించిన సర్వేలోనే తేలిందట. దీంతో ఆప్ ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకత తమకు కలిసివస్తుందని భావించిన బీజేపీ నేతలకు షాక్ తగిలినట్టయ్యింది. ఈ నేపథ్యంలో ఆప్పై అవినీతి ముద్ర వేస్తే అటు గుజరాత్లో.. ఇటు ఎంసీడీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీని దెబ్బతీయొచ్చని కమలం పార్టీ నేతల ప్రణాళిక అని ది ప్రింట్ పేర్కొన్నది.