Rajesh Mishra: చదువుకు వయసు అడ్డం కాదంటారు. చదువుకోవాలనే ఆసక్తి ఉంటే ఏ వయసులోనైనా చదువుకోవచ్చని చెబుతుంటారు. ఆర్థిక ఇబ్బందుల వల్లనో, మరే ఇతర అనివార్య కారణాల వల్లనో చదువును మధ్యలో ఆపేసిన వాళ్లు.. ఆ తర్వాత చదువును కొనసాగించి తమ కలను నెరవేర్చుకుంటుంటారు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ పరిధిలోగల బిత్రీ చైన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజేష్ కుమార్ మిశ్రా అలియాస్ పప్పు భరతౌల్ అదే పనిచేశారు.
బీజేపీ నాయకుడైన రాజేశ్ మిశ్రా గత ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు. ఇప్పుడు బీఏ పరీక్షలు రాస్తున్నారు. సోమవారం బీఏ మొదటి సంవత్సరం హిందీ పరీక్ష రాశారు. తాను ఇంటర్మీడియట్ పాసయ్యానని, ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చేస్తున్నానని, ఆ తర్వాత ఎల్ఎల్బీ చేయాలనుకుంటున్నానని ఆయన చెప్పారు. లా పూర్తి చేశాక పేద ప్రజలకు ఉచితంగా న్యాయ సాయం చేస్తానని తెలిపారు.
తన జీవితంలో రాజకీయాలకు, చదువులకు, వయసుకు సంబంధం లేదని రాజేశ్ మిశ్రా చెప్పారు. చిన్నప్పటి నుంచి తాను న్యాయవాది కావాలనుకునేవాడినని తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షలో మంచి మార్కులతో పాసయ్యానని, గ్రాడ్యుయేషన్ కూడా పాసవుతానని చెప్పారు. ప్రతి సమస్యకు చదువుతోనే పరిష్కారం లభ్యమవుతుందని, విద్యతోనే పేదరికాన్ని తరిమి కొట్టవచ్చని అన్నారు.