లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 172 మంది అభ్యర్థులను బీజేపీ గురువారం ఖరారు చేసింది. సీఎం యోగి ఆదిత్యనాథ్తోపాటు, డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్య పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయోధ్య నియోజకవర్గం నుంచి ఆదిత్యనాథ్, సిరతు నుంచి కేశవ్ మౌర్య పోటీ చేస్తారని తెలుస్తున్నది. ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్లను కూడా ఎన్నికల బరిలోకి దించే ఆలోచనలో బీజేపీ ఉన్నది. లక్నో నియోజకవర్గాల్లో ఒక దాని నుంచి శర్మ పోటీ చేసే అవకాశమున్నది. గురువారం ఖరారు చేసిన 172 మందిలో చాలా మంది అభ్యర్థులు ఫిబ్రవరి 10న జరుగనున్న తొలి దశ ఎన్నికల్లో పోటీచేసే వారేనని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రుల నేతృత్వంలో యూపీ బీజేపీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు జరుగుతున్నది. సీఎం యోగి ఆదిత్యనాథ్తోపాటు యూపీకి చెందిన పలువురు సీనియర్ నేతలు ఇందులో పాల్గొన్నారు. అయితే కరోనా బారినపడిన జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ప్రధాని మోదీ కూడా వర్చువల్గా జాయిన్ అవుతారని సమాచారం.
మరోవైపు ఇప్పటికే పలువురు మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు బీజేపీని వీడుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ నిరాకరించవచ్చని సమాచారం. అయితే 2017 అసెంబ్లీ ఎన్నికల కంటే ఈ సారి మరిన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తామని డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్య ధీమా వ్యక్తం చేశారు. ఫిబ్రవరి పది నుంచి ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.