న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అవినీతి ఆరోపణలున్న ముగ్గురు మున్సిపల్ కౌన్సిలర్లను ఆరేండ్ల పాటు పార్టీ నుంచి బీజేపీ బహిష్కరించింది. దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (SDMC)కు చెందిన సాదులాజాబ్ కౌన్సిలర్ సంజయ్ ఠాకూర్, తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (EDMC)కు చెందిన న్యూ అశోక్ నగర్ కౌన్సిలర్ రజనీ బబ్లూ పాండే, ఉత్తర ఢిల్లీలోని ముఖర్జీ నగర్ కౌన్సిలర్ పూజా మదన్లపై అవినీతి ఆరోపణలు రావడంతో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేష్ గుప్తా వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
అవినీతి ఆరోపణలున్న మరి కొందరిపైనా చర్యలు తీసుకుంటామని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేష్ గుప్తా హెచ్చరించారు. ఈ చర్య బీజేపీ ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. అవినీతికి పాల్పడే మున్సిపల్ కౌన్సిలర్లే కాదు మున్సిపల్ అధికారులను కూడా వదిలిపెట్టేది లేదన్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వీడియో రికార్డు చేయాలని ప్రజలను ఆయన కోరారు. దీంతో వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు.
కాగా, బీజేపీ పాలనలో ఉన్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లకు వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. కార్పొరేషన్లలో అవినీతిపై ఢిల్లీలోని అధికార ఆప్ పార్టీ మండిపడుతున్నది. ఈ నేపథ్యంలో అవినీతి ఆరోపణలున్న ముగ్గురు కౌన్సిలర్లపై బీజేపీ వేటు వేసింది. వారిని ఆరేండ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది.