న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) ఎప్పటిలాగే ఈ సారి కూడా ఎన్నికల గిమ్మిక్కులు మొదలు పెట్టింది. 2014లో అధికారంలోకి వచ్చింది మొదలు వంట గ్యాస్ ధరలు పెంచుకుంటూ సామాన్యుల నడ్డి విరగగొట్టిన బీజేపీ సర్కారు.. ఇప్పుడు ఉన్నట్టుండి ఒకేసారి 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధరను రూ.200 తగ్గించింది. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ చేసిన నిర్ణయాన్ని మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతూ వచ్చినా ఏనాడూ వంట గ్యాస్ ధరను గానీ, పెట్రో ధరలను గానీ తగ్గించని నరేంద్రమోదీ ప్రభుత్వం.. ఇప్పుడు ఎన్నికల్లో లబ్ధి కోసం సిలిండర్ ధరను ఏకంగా రూ.200 తగ్గించడం విడ్డూరంగా ఉంది. ఈ రూ.200 తగ్గింపు ధర గ్యాస్ వినియోగదారులు అందరికీ వర్తించనుండగా, ఉజ్వల స్కీమ్ కింద గ్యాస్ కనెక్షన్ పొందిన వారికి రూ.200 అదనపు సబ్సిడీ ఇకపై కూడా కొనసాగనుందని కేంద్రం తెలిపింది.
మొత్తంగా చూస్తే సాధారణ వినియోగదారులు అందరికీ ఒక సిలిండర్పై రూ.200, ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులకు రూ.400 లబ్ధి చేకూరనుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. కాగా, 2014లో రూ.400 గా ఉన్న వంట గ్యాస్ ధరను రూ.1,200 లకు పెంచి, ఇప్పుడు అందులోంచి రూ.200 తగ్గించి, మహిళలకు రాఖీ కానుక, ఓనమ్ కానుక అని చెప్పడం.. బీజేపీ అతి తెలివికి, దగాకోరు తనానికి నిదర్శనమని జనం మండిపడుతున్నారు.