(స్పెషల్ టాస్క్ బ్యూరో ) హైదరాబాద్, నవంబర్ 14 ( నమస్తే తెలంగాణ): గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలువడం సులభం కాదని బీజేపీ అధిష్ఠానానికి ముందే తెలుసా? ఏడాది కిందటే దీనిపై సర్వే నివేదిక అందిం దా? అందుకే సీఎం సహా క్యాబినెట్లో మార్పులు చేసిందా? ఇప్పుడు 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అందుకే టికెట్ ఇవ్వటం లేదా? అంటే పార్టీ విశ్వసనీయ వర్గాలు అవునంటున్నాయి. బీజేపీ పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అంతర్గత సర్వేల ద్వారా అధిష్ఠానం తెలుసుకొన్నది. దిద్దుబాటు చర్యల్లో భాగంగానే 2021లో అప్పటి సీఎం విజయ్ రూపానీ, మంత్రి మండలిని మార్చాలని నిర్ణయం తీసుకొన్నట్టు ఆ వర్గాల సమాచారం. సామాజిక సమీకరణాల మేరకు క్యాబినెట్లో మార్పులు, చేర్పులు చేసినట్టు తెలిసింది. ఎక్కువ మంది సిట్టింగ్లను తప్పించి కొత్త ముఖాలను బరిలో నిలిపేందుకు ఆనాడే నిర్ణయం తీసుకొన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.