బెంగళూరు, ఏప్రిల్ 28: కర్ణాటకలో అధికార బీజేపీ ఎమ్మెల్యేలకు కాంట్రాక్టుల్లో 40% కమీషన్ వ్యవహారం పర్యాటక శాఖను కూడా తాకింది. దండేలీలోని కాళీ నదిలో స్పీడ్ బోటింగ్ టెండర్ను గెలుచుకొన్న సంస్థకు అధికారులు కాంట్రాక్టు అప్పగించకుండా వేధిస్తున్నారు. టూరిజం మంత్రి ఆనంద్ సింగ్ ఆదేశాల మేరకే సదరు సంస్థకు కాంట్రాక్టు అప్పగించడం లేదని, పాత కాంట్రాక్టరు దగ్గర లంచం తీసుకొని అతన్నే కొనసాగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నదిలో స్పీడ్ బోటింగ్కు ప్రభుత్వం జనవరిలో బిడ్లను ఆహ్వానించింది. టికెట్లపై వచ్చిన మొత్తంలో 64% చెల్లిస్తామని టెండర్ వేసి ‘ఆల్గ్రోటిప్ హాస్పిటాలిటీ లిమిటెడ్’ బిడ్ను గెలుచుకొన్నది.
పాత కాంట్రాక్టే పొడిగింపు
కర్ణాటక ప్రభుత్వం ఇప్పటివరకు ఆల్గోట్రిప్ సంస్థతో ఒప్పందం చేసుకోలేదు. కాంట్రాక్టును అప్పగించలేదు. పాత కాంట్రాక్టునే పొడిగిస్తున్నామంటూ మార్చి 25న ఆల్గ్రోట్రిప్కు లేఖ రాసింది. దీనిపై కర్ణాటక రాష్ట్ర సమితి స్టేట్ జనరల్ సెక్రెటరీ దీపక్ తీవ్రంగా స్పందించారు. మంత్రి ఆనంద్ సింగ్ పాత కాంట్రాక్టరు దగ్గర లంచం తీసుకొని ఈ టెండర్ను ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం బొమ్మైకి కూడా ఫిర్యాదు చేశారు. కాళీ నదిలో ఇంతకుముందు జేఎల్ఆర్ అనే సంస్థ స్పీడ్ బోటింగ్ టెండర్ దక్కించుకొన్నది.
నేనే టెండర్లను ఆపేశాను
అవినీతి ఆరోపణలపై మంత్రి ఆనంద్ సింగ్ స్పందించారు. టెండర్ ప్రక్రియను తానే ఆపేసినట్టు పేర్కొన్నారు. టెండర్లలో రాజకీయ జోక్యం ఎక్కువైందని అన్నారు. స్పీడ్ బోటింగ్ కాంట్రాక్టును వేరేవాళ్లకు ఇచ్చినప్పటితో పోల్చితే జేఎల్ఆర్ సంస్థకు అప్పగించినప్పుడు రెట్టింపు లాభాలు వచ్చాయని పేర్కొన్నారు. అందుకే కాంట్రాక్టును కొంతకాలం పొడిగించినట్టు చెప్పారు. బోటింగ్ను ఏజెన్సీలకు అప్పగించాలా… ప్రభుత్వమే నిర్వహించాలా అన్నదానిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.
కమీషన్ రాజ్
కర్ణాటకలో కమీషన్ రాజ్ నడుస్తున్నదని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించాలంటే 45 శాతం కమీషన్ ఇవ్వాలని అధికార బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారని పేర్కొంటున్నారు. దీనిపై ప్రధాని మోదీతోపాటు, సీఎం బొమ్మైకి ఫిర్యాదుచేసినా ఎలాంటి ఫలితం ఉండట్లేదని చెబుతున్నారు. కమీషన్ వేధింపులు భరించలేక ఇటీవలే ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలోనే మంత్రి ఈశ్వరప్ప తన పదవికి రాజీనామా చేశారు. కేవలం కాంట్రాక్టర్ల దగ్గర నుంచే కాకుండా మఠాలకు ఇచ్చే గ్రాంట్లలోనూ అధికార పార్టీ నేతలు కమీషన్ దండుకుంటున్నారని మఠాధిపతి దింగలేశ్వర్ స్వామీజీ ఇటీవల ఆరోపించడం కలకలం రేపింది.