ఉన్నవ్: ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతాపార్టీ నవాబ్గంజ్ జిల్లా పంచాయతీ చైర్మన్ పదవి కోసం ఎంపిక చేసిన అభ్యర్థిని మార్చేసింది. ఆయన నవాబ్గంజ్ జిల్లా పంచాయతీ చీఫ్గా ఎన్నికైతే తన ప్రాణాలకే ప్రమాదం అంటూ ఉన్నవ్ అత్యాచార బాధితురాలు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు, ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాయడంతో.. బీజేపీ ఆ జిల్లా చీఫ్ అభ్యర్థిని మారుస్తూ నిర్ణయం తీసుకుంది.
ముందుగా నవాబ్గంజ్ బ్లాక్ పంచాయతీ చీఫ్ పదవికి బీజేపీ అభ్యర్థిగా అరుణ్సింగ్ను ఎంపికచేశారు. అయితే అరుణ్సింగ్ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్కు అత్యంత సన్నిహితుడు. ఉన్నవ్ అత్యాచారం కేసులో కుల్దీప్ సెంగార్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 2017లో ఉన్నవ్ అత్యాచారం జరుగగా.. 2019, డిసెంబర్లో ఢిల్లీ కోర్టు ఆయనకు జీవితకాల కారాగార శిక్ష విధించింది.
ఈ నేపథ్యంలో కుల్దీప్ సెంగార్కు అత్యంత సన్నిహితుడైన అరుణ్సింగ్ను జిల్లా పంచాయతీ చైర్మన్ పదవికి బీజేపీ అభ్యర్థిగా ఎంపిచేయడంపై ఉన్నవ్ అత్యా చార బాధితురాలు అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు, ప్రధాని నరేంద్రమోదీకి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్కు లేఖలు రాసింది. దాంతో పంచాయతీ చీఫ్ అభ్యర్థిత్వం నుంచి బీజేపీ అరుణ్సింగ్ను తొలగించింది.