యూపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలను బీజేపీ వాయిదా వేసుకుంది. గాన కోకిల లతా మంగేష్కర్ మరణంతో ఆమెకు గౌరవ సూచకంగా మేనిఫెస్టో విడుదలను తాత్కాలికంగా బీజేపీ వాయిదా వేసింది. యూపీ ఎన్నికల్లో భాగంగా మేనిఫెస్టోను విడుదల చేయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్షా, సీఎం యోగి, డిప్యూటీ సీఎం కౌశవ ప్రసాద్ మౌర్యతో సహా పలువురు లక్నోకు చేరుకున్నారు. ఈ సమయంలోనే గాన కోకిల లత మంగేష్కర్ మరణించారన్న వార్త తెలిసింది. దీంతో ఆమెకు గౌరవ పురస్సరంగా మేనిఫెస్టో విడుదలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత రెండు నిమిషాల పాటు అందరూ మౌనం పాటించారు. మేనిఫెస్టో విడుదల తేదీని అతి త్వరలోనే ప్రకటిస్తామని యూపీ బీజేపీ పేర్కొంది. ‘గాన కోకిల లతా మంగేష్కర్ మృతి చెందారు. దీంతో తాము పార్టీ మేనిఫెస్టో విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాం. కొన్ని రోజుల్లోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ ప్రకటించారు.
గాన కోకిల లతా మంగేష్కర్ ఆదివారం కన్నుమూశారు. జనవరి 8 న ఆమె కరోనా బారినపడ్డారు. గత 29 రోజులుగా ఆమె ముంబైలోని బ్రీచ్కాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఆరోగ్యం కాస్త మెరుగైందని వార్తలొచ్చాయి. అంతలోనే ఆరోగ్యం విషమించి, తుది శ్వాస విడిచారు. పలు అవయవాల వైఫల్యం వల్ల లతా మంగేష్కర్ తుది శ్వాస విడిచారని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.