కోజికోడ్: 2024లో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో.. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ 50 సీట్లు కోల్పోతుందని కాంగ్రెస్ నేత శశి థరూర్ తెలిపారు. 2019 నాటి ఫలితాలను ఆ పార్టీ రిపీట్ చేయడం అసాధ్యమని ఆయన అన్నారు. కేరళ లిట్రేచర్ ఫెస్టివల్లో ఆయన మాట్లాడారు. బీజేపీ ఆధిపత్యమే ఉన్నా.. చాలా రాష్ట్రాల్లో ఆ పార్టీ పట్టు కోల్పోతున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర సర్కార్ను కూడా ఆ పార్టీ కోల్పోవడం అసాధ్యమేమీ కాదన్నారు.
2019 ఎన్నికల్లో హర్యానా, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ దాదాపు అన్ని సీట్లు గెలిచిందని, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లోనూ కొన్ని సీట్లు గెలిచిందని, ఇక బెంగాల్లో ఆ పార్టీ 18 సీట్లు గెలిచినట్లు థరూర్ తెలిపారు. కానీ 2024లో బీజేపీకి ఆ మెజారిటీ రాదు అని ఆయన అన్నారు. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు గెలిచిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 52 సీట్లలో మాత్రమే విజయం సాధించింది.